Begin typing your search above and press return to search.

రాహుల్ వెళ్ల‌గానే...కేటీఆర్ లైన్లోకి వ‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   15 Aug 2018 5:09 AM GMT
రాహుల్ వెళ్ల‌గానే...కేటీఆర్ లైన్లోకి వ‌చ్చేశాడు
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. రెండు రోజుల సుడిగాలి ప‌ర్య‌ట‌న‌తో బిజీ బిజీగా గ‌డిపిన రాహుల్ ఈ సంద‌ర్భంగా కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం బ‌హిరంగ స‌భ‌లు - డ్వాక్రా మ‌హిళ‌ల‌తో స‌మావేశం అయిన రాహుల్ మంగళవారం ఉదయం బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫిరెన్స్ లో మాట్లాడారు రాహుల్. ఆ తర్వాత హోటల్ హరిత ప్లాజాలో సీనియర్ లీడర్లతో విడివిడిగా సమావేశం అయ్యి పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఆ తర్వాత గన్ పార్క్ దగ్గర అమరులకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్ధి గర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ…రాష్ట్ర సర్కార్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్రం వచ్చాక కూడా తెలంగాణ ప్రజల కోరిక నెరవేరలేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ నాలుగేళ్లలో కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. అవినీతికి రీ డిజైన్ పేరు పెట్టి దోచుకుంటున్నారన్నారు.

రాహుల్ ఇలా విరుచుకుప‌డిన నేప‌థ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. త‌నకు అత్యంత ఇష్ట‌మైన సోష‌ల్ మీడియా మాధ్య‌మం ట్విట్టర్‌ లో ఆయ‌న రాహుల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ - మీడియా స్వేచ్ఛ గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య గొంతుక - విలువలను కాలరాసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ ఆరోపించారు. రాహుల్‌ తోపాటు వేదికపై కూర్చున్న వారిలో సగం మంది బెయిల్‌ పై ఉన్నవారేనని ఆయ‌న ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్ పార్టీగా మారింది. ఏ అంటే ఆదర్శ్ - బీ అంటే బోఫోర్స్ - సీ అంటే కామన్వెల్త్.. ఇంకా మీ కుంభకోణాల గురించి చెప్పాలా రాహుల్ అని ఎద్దేవా చేశారు.

``దేశంలో ఒకే ఒక్కసారి ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాహుల్‌ గాంధీకి గుర్తు చేస్తున్నా. ఇందిరాగాంధీ హయాంలో 1969 ఉద్యమ సమయంలో 369 మంది యువకులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌ ది. మలిదశ ఉద్యమంలో కూడా వందలాది మందిని పొట్టనపెట్టుకున్నది. కాంగ్రెస్ బలితీసుకున్న అమాయకులకే నివాళులర్పించిన సంగతి రాహుల్‌ గాంధీకి తెలుసా?`` అని కేటీఆర్ ప్రశ్నించారు.