Begin typing your search above and press return to search.

పీఠంపై కేటీఆర్‌...ఇదే తొలి ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   17 Dec 2018 8:05 AM GMT
పీఠంపై కేటీఆర్‌...ఇదే తొలి ప్ర‌క‌ట‌న‌
X
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీల‌క ఘ‌ట్టం పూర్త‌యింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ - పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - పలు కార్పొరేషన్ల చైర్మన్లు అభినందనలు తెలిపారు.

ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరే ముందు కేటీఆర్.. తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లిదండ్రులు కేసీఆర్ - శోభా ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్‌ కు...సోదరి కవిత ఆయన నుదుట తిలక దిద్ది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌ కు కేటీఆర్ బయల్దేరారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి కళాకారుల ఆటపాటలు - నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తనకు కేటాయించిన చాంబర్‌ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేటీఆర్‌ కు పార్టీ సీనియర్ నేతలు - మాజీ మంత్రులు - ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని పేర్కొన్నారు. ``మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల - మతాలకు అతీతంగా టీఆర్ ఎస్ ను ఆశీర్వదించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాను. టీఆర్ ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మల్చడానికి పెద్దలు కేసీఆర్ నాకు ముఖ్యమైన బాధ్యత అప్పజెప్పారు. నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తాను. పార్టీ కార్యాలయాల నిర్మాణం - శిక్షణ - సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేస్తా. ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతా. ప్రజలకు - ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తా.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా - హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను`` అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణభవన్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహముద్ అలీ - మాజీ మంత్రులు హరీశ్ రావు - జగదీశ్ రెడ్డి - పోచారం శ్రీనివాస్ రెడ్డి - తలసాని శ్రీనివాస్ యాదవ్ - లక్ష్మారెడ్డి - పట్నం మహేందర్ రెడ్డి - పద్మారావు - తుమ్మల నాగేశ్వర్ రావు - ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - గుత్తా సుఖేందర్ రెడ్డి - మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి - మేయర్ బొంతు రామ్మోహన్ - శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు - పార్టీ సీనియర్ నేతలు - భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.