Begin typing your search above and press return to search.

వీపు ప‌గులుతుంద‌నే అలా చేశాం

By:  Tupaki Desk   |   25 Jun 2017 6:57 AM GMT
వీపు ప‌గులుతుంద‌నే అలా చేశాం
X
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు కూడా త‌న తండ్రి -ముఖ్యమంత్రి కేసీఆర్ లాగే వాగ్భాణాలు సంధించ‌డంలో, గురిచూసి విమ‌ర్శ‌లు చేయ‌డంలో ప‌ట్టు ఉంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అవకాశం దొరికి, సంద‌ర్భం కుదిరితే అంశాల ఆధారంగానే కాకుండా సెటైర్ల ద్వారా కూడా ఆక‌ట్టుకునే ప్ర‌సంగం చేయ‌డంలో కూడా కేటీఆర్ దిట్ట. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల కేంద్రంలో 'నేతన్నకు చేయూత' అనే పొదుపు పథకాన్ని ప్రారంభించిన అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ 'మీరు ఏమైనా తెల్లటి చందమామ ఇస్తే మేము మసిచేసి మరక చేశామా? అప్పుడు మీరు చేసిన పాపాల వల్లే కదా.. రాష్ట్రాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.. తలాపున వెళ్తున్న కృష్ణ నీళ్లను ప్లోరోసిస్‌ ప్రాంతాలకు అందించే దమ్ములేని నాయకులు ఇప్పుడు టీఆర్‌ ఎస్‌ పై విమర్శలు చేయడం సరికాదు. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి' అని కాంగ్రెస్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ‌త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరేడు అడుగులు ఉంటే సరిపోదని, అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చిత్తూరుకు జలాలను తరలించేందుకు రూ.9వేల కోట్లు తీసుకెళ్లినా ఆపే దమ్ములేక మిన్నకున్నారని కేటీఆర్ విమర్శించారు. తాము ఫ్లోరిన్‌ సమస్య పరిష్కారానికి మిషన్‌ భగీరథ ప్రారంభిస్తే కమీషన్‌ భగీరథ అంటూ మాట్లాడి సంస్కార హీనులయ్యారని అన్నారు. రెండు లక్షల మంది ఫ్లోరోసిస్‌ బారినపడి చనిపోతుంటే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. నేతన్నకు సామాజిక భద్రత - ఆర్థిక భరోసా కల్పించడానికే రూ.75కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకాన్ని ప్రారంభించినట్టు కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 40వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. నూలు, అద్దకం రసాయనాల మీద 50 శాతం సబ్సిడీని త్వరలోనే ఇస్తామని చెప్పారు. దేశంలోనే అతి పెద్దదైన ఫామ్‌ టూ ఫ్యాషన్‌ కాకతీయ మెగా టెక్స్‌ టైల్స్‌ పార్క్‌ వరంగల్‌ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోవడంతో త్వరలోనే టెక్స్‌తో మార్కెటింగ్‌ చేయడానికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడానికి దసరా - దీపావళి పండుగల నాటికి పెద్ద షోరూంను ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్‌ కు ఓటు వేసి రుణం తీర్చకోండంటూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాట్లాడటంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గత్యంతరంలేక - తప్పనిసరి పరిస్థితుల్లోనే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. `` కాంగ్రెస్‌ కు ఏం రుణం తీర్చుకోవాలి? ఏం ఇచ్చిండ్రని రుణం తీర్చుకోవాలి? మర్యాదగ ఇచ్చిండ్రా? ఎన్ని ఉద్యమాలు - ఎన్ని త్యాగాలు - ధర్నాలు - నిరాహారదీక్షలు - రాస్తారోకోలు - బతుకమ్మలు - బోనాలు - ఆందోళనలు చేస్తే.. ఇయ్యకపోతే వీపు పగులుతుందని భయపడి ఇచ్చారు`` అని కేటీఆర్ అన్నారు. నాడు తెలంగాణ సాధన ఉద్యమంలో కలిసిరాలేదు.. ఇప్పుడు బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం అంటే కలిసొచ్చే సంస్కారం లేదు అంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు త‌మ‌కు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, మంచి పనులు చేస్తే మళ్లీ గెలిపిస్తార‌ని లేకుంటే ఓడగొడుతార‌నే విషయం త‌మ‌కు తెలుసు అని కేటీఆర్ స్పష్టంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/