Begin typing your search above and press return to search.

టీడీపీ నంబర్ 2.. వీడుతున్నాడా.?

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:52 AM GMT
టీడీపీ నంబర్ 2.. వీడుతున్నాడా.?
X
కేఈ కృష్ణమూర్తి.. గడిచిన టీడీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ నేత.. ఎన్నికలకు ముందే తన బద్ధశత్రువైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నందుకు అలిగి టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కిన కేఈ కృష్ణ మూర్తి ఇప్పుడు అసలు టీడీపీ కార్యకలాపాలకే దూరంగా ఉండడం కర్నూలు జిల్లాలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. టీడీపీపై గుర్రుగా ఉన్న ఆయన అటు వైసీపీ - ఇటు బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారన్న వార్త టీడీపీలో కలకలం రేపుతోంది.

కర్నూలులో కేఈ ఫ్యామిలీకి బాబు ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీలో సీనియర్ అయిన కేఈని డిప్యూటీ సీఎం చేసి ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్ ఇచ్చాడు బాబు. ఆయన తమ్ముడు ప్రభాకర్ కు ఎమ్మెల్సీ ఇచ్చాడు. మొన్నటి ఎన్నికల వేళ కేఈ పోటీచేయకుండా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు శ్యాంబాబుకు చంద్రబాబు పత్తికొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కేఈ కుమారుడు - తమ్ముడు కూడా దారుణంగా ఓడిపోయాడు. మొత్తం కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

బీసీల్లో బలమైన నేతలుగా ఉన్న కేఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఓడిపోవడంతో అదంతా టీడీపీపై వ్యతిరేకతే కారణమని.. తమపై కాదని కేఈ ఫ్యామిలీ భావిస్తోంది. కర్నూలులో టీడీపీ లేచే పరిస్థితి లేదని.. తమకు సన్నిహితులైన వైఎస్ ఫ్యామిలీ వెంట నడిస్తే ఎలా ఉంటుందని కేఈ ఫ్యామిలీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అయితే జగన్ వీరిని తీసుకునే అవకాశాలు లేకపోవడంతో కేఈ ఫ్యామిలీ చూపు ఇప్పుడు బీజేపీ వైపు మళ్లిందట.. ఓ హత్య కేసు కూడా కేఈ ఫ్యామిలీని వెంటాడుతోంది. అందుకే బీజేపీ అయితే తమకు రక్షణ అని భావిస్తున్నారట.. అయితే కేఈ నిజంగానే టీడీపీని వీడితే కర్నూలు జిల్లాలో టీడీపీ ఖతమైనట్టేనన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. బీజేపీ ఆఫర్ కూడా ఇచ్చిందని.. కేఈ దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.