Begin typing your search above and press return to search.

బాబుకు ‘హ్యాండి’చ్చి పార్టీ మారుతోన్న కేఈ?

By:  Tupaki Desk   |   17 Jun 2018 8:17 AM GMT
బాబుకు ‘హ్యాండి’చ్చి పార్టీ మారుతోన్న కేఈ?
X
ఐదేళ్లు పాలించిన పార్టీకి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి అయితే ఇంకా ఎక్కువే ఉంది. అయితే 2019 ఎన్నికలకు ముందే నాయకులు సర్ధుకుంటున్నారు. గెలిచే పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందుకు వారు చూపిస్తున్న కారణాలు సిల్లీగా ఉన్నాయి. కానీ దానివెనుక టీడీపీని వీడాలన్న కోరిక బలం గా ఉంది. టీడీపీలో మంత్రులుగా కొనసాగుతున్న వారే టీడీపీని వీడి వైసీపీలోకి చేరాలని ఉబలాటపడుతుండడం తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు ఓకే చెబితే.. తాను ఉరివేసుకుంటానని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎదిగిన కేఈ ఇప్పుడు అదే కాంగ్రెస్ ను బూచీగా చూపి పార్టీ వీడేందుకు అడుగులు వేస్తున్నాడనే అనుమానాలు టీడీపీలో కలుగుతున్నాయి.

ఇదంతా చూసి రాజకీయ విశ్లేషకులు కేఈ టీడీపీని వీడడానికే ఇలా కారణాలను చూపిస్తున్నాడని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతా బాగా లేవు. అందుకే కేఈ పార్టీ మారాలనుకునే చంద్రబాబు తీరును విమర్శిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగతా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ జెండాతో వచ్చేసారి ఎన్నికలకు వెళితే ఓట్లు పడవేమో అన్న ఆందోళనలో ఉన్నారట.. అందుకే ఉపముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా కేఈ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

గతంలోనూ కేఈ వేరే పార్టీలతో సంప్రదింపులు జరిపినట్టు టాక్ ఉంది. పార్టీలు ఈజీగా మార్చిన దాఖలాలున్నాయి. దీంతో తన బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కలవబోతున్న చంద్రబాబు వైఖరిని బూచీగా చూపి కేఈ పార్టీ మారబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇది ఓ రకంగా టీడీపీలోని వ్యతిరేకతను - వైసీపీకి కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తర్వాత ప్రజల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ గమనించిన ఉపముఖ్యమంత్రి కేఈ వచ్చే ఎన్నికల్లోపే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.