Begin typing your search above and press return to search.

కేఈ మాట‌!... సీఎం త‌ర్వాత నేనే!

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:48 AM GMT
కేఈ మాట‌!... సీఎం త‌ర్వాత నేనే!
X
ఏపీలో అధికారులు - అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాదు డిప్యూటీ ముఖ్య‌మంత్రి స్థాయి నేత‌ల్లోనూ అస‌హ‌నం పెల్లుబుకుతోంది. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను - ప్ర‌చార ఆర్భాటాల‌ను ప్ర‌శ్నిస్తున్న వారిని నోర్ముయ్‌.. అంటూ విరుచుకుప‌డుతున్నారు. ఎప్పుడూ మౌనంగా - సున్నితంగా ఉండే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రైతుపై రెచ్చిపోయారు. భారీ ఎత్తున కేక‌లు పెట్టారు. న‌న్నే ప్ర‌శ్నిస్తావా? అంటూ క‌ళ్లు ఉరిమారు. దీంతో త‌న బాధ‌ల చెప్పుకునేందుకు వ‌చ్చిన రైతు బిక్క‌చ‌చ్చిపోయాడు. విషయంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నారు.

ఎమ్మెల్యేలు - నేతలు - మంత్రులు సైతం వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల సాధ‌క బాధ‌లు తెలుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌పై ఆగ్ర‌హావేశాలు వెళ్ల‌గ‌క్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సాక్షాత్తూ.. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ - కేఈ కృష్ణ‌మూర్తి ఓ అన్న‌దాత‌పై త‌న ప్ర‌తాపం చూపించారు. తనకు రుణ మాఫీ కాలేదని అడిగిన రైతుపై తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. అసహనంతో ‘షటప్‌.. డోంటాక్‌.. (నోర్ముయ్‌.. మాట్లాడొద్దు) నాన్‌ సెన్స్‌.. వింటే విను లేకుంటే వెళ్లిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా! నేను డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తిని. సారా తాగిన నాయాళ్లతో ఇక్కడికొచ్చి అల్లరి చేస్తావా`` అంటూ నిప్పులు చెరిగారు.

అంతేకాదు, ఫ్యాక్షన్‌ గ్రామాల్లో తిరిగినట్లు మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి వచ్చా. చేతులు చూపించి మాట్లాడతావా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇక‌, ఒక్క‌సారిగా కేఈ ఇలా ప్ర‌వ‌ర్తించేస‌రికి టీడీపీ కార్యక‌ర్త‌లు సైతం విస్తుపోయారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారేనని వ్యాఖ్యానించారు. ‘1978లో నేను డోన్‌ నుంచి ఇందిరా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశా. చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరాం’ అని అన్నారు. కానీ, కేఈ ఇలా ఒక్క‌సారిగా ఫైర‌య్యేస‌రికి అంద‌రూ నిర్ఘాంత పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపైనే చాలా సేపు చ‌ర్చించుకున్నారు.