Begin typing your search above and press return to search.

కేఈ గారూ... హుందాను గాలికొదిలేశారా?

By:  Tupaki Desk   |   25 Sep 2017 1:10 PM GMT
కేఈ గారూ... హుందాను గాలికొదిలేశారా?
X
కేఈ కృష్ణ‌మూర్తి... న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఆది నుంచి హూందాగానే వ్య‌వ‌హ‌రిస్తూ... తెలుగు నేల రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేత‌గా మ‌నంద‌రికీ తెలిసిందే. త‌మ్ముళ్లు కేఈ ప్ర‌భాక‌ర్‌ - కేజీ జ‌య‌న్న‌ - కేఈ ప్ర‌తాప్‌ - కుమారుడు కేఈ శ్యాంబాబులు దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల‌ని పేరున్నా... ఏనాడూ కేఈ ఈ ముద్ర‌ను త‌న‌పై వేసుకోలేదు. అస‌లు కేఈ కృష్ణ‌మూర్తి నోరు తెరిచారంటే... అది ఎంతో ప్రాధాన్యం క‌లిగిన అంశ‌మైతే త‌ప్పించి ఆయ‌న మాట వినప‌డేది కాదు. మృధు స్వ‌భావిగానే ముద్ర వేసుకున్న కేఈ... త‌న‌కు ఏ ప‌ద‌వి అప్ప‌గించినా కూడా దానికి న్యాయం చేసిన నేత‌గానూ ఆయ‌న‌కు టీడీపీలో మంచి పేరే ఉంది. ఎమ్మెల్యేగా - ఎంపీగా - రాష్ట్ర మంత్రిగా - ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఆయ‌న ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించారు. ఏనాడూ వివాదాల జోలికి పోలేదు.

ఇదంతా గ‌తం. ఇప్పుడు కేఈ దాదాపుగా చ‌ర‌మాంకంలో ఉన్న‌ట్లే లెక్క‌. ఏపీకి డిప్యూటీ సీఎంగానే కాకుండా చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ అయిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న కేఈ... ఆశించిన మేర ప‌నిచేయ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. అయితే ఆయ‌న‌లో చేవ త‌గ్గింద‌ని కాదు గానీ.. వ‌య‌సు మీద ప‌డిన నేప‌థ్యంలో న‌డిచేందుకు నానా ఇబ్బందులు ప‌డుతున్న కేఈ... కేబినెట్ మీటింగుల‌కు కూడా హాజ‌రుకాలేక‌పోతున్న ప‌రిస్థితి. అయితే కేఈ ప‌రిస్థితిని అర్థం చేసుకున్న టీడీపీ అధిష్ఠానం... ప్రాధాన్యం క‌లిగిన కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న హాజ‌రుకాకున్నా కూడా ఏమీ అన‌డం లేదు. ఇదంతా బాగానే ఉన్నా... ఇటీవ‌లి కాలంలో కేఈ కృష్ణ‌మూర్తి త‌న స్థాయిని తగ్గించుకునే ప‌నులు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

త‌న కుమారుడి వ‌య‌సు ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌లి కాలంలో కేఈ ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు. జ‌గ‌న్‌ పై కేఈ చేస్తున్న విమ‌ర్శ‌లు ఆయ‌న హుందాత‌నానికి మాయ‌ని మ‌చ్చ తెచ్చేస్తున్నాయ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. వైరి వ‌ర్గాల‌న్నాక ఏదో... యుక్త వ‌య‌సులో ఉన్న నేత‌లు చేసే ఘాటు కామెంట్లు ఇప్పుడు చ‌ర‌మాంకంలోకి చేరిన కేఈ నోట వినిపిస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొన్న‌టిదాకా ఎలాంటి ఘాటు వ్యాఖ్య‌లు వినిపించ‌ని కేఈ నోట‌... ఇప్పుడు ఏమాత్రం ప‌రిప‌క్వ‌త లేని రాజ‌కీయ నాయకులు చేస్తున్న త‌ర‌హా మాట‌లు వినిపిస్తుండ‌టం కూడా ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తోంది.

అయినా కేఈ ఇప్పుడేమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుద‌ల‌కు సంబంధించి మొన్న సాక్షి ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల‌ను ఆస‌రా చేసుకుని నిన్న కేఈ క‌ర్నూలులో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. *పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదలచేసే విషయంపై జగన్‌ తన పత్రిక ద్వారా తెలంగాణలో విష ప్రచారం చేయడం దారుణం. రాయలసీమపై ఎందుకు విషం కక్కుతున్నావు? ఇక్కడివారు మీకు మనుషుల్లా కనిపించడం లేదా? మీరు అసలు రాయలసీమలోనే పుట్టారా? అన్న అనుమానం కలుగుతోంది' అని వ్యాఖ్యానించిన కేఈ... త‌న హుందాత‌నానికి తిలోద‌కాలిచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది.