Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఏపీ నిరాశ‌ప‌రుస్తుందా?

By:  Tupaki Desk   |   25 Feb 2017 10:41 AM GMT
కేసీఆర్‌ ను ఏపీ నిరాశ‌ప‌రుస్తుందా?
X
ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజధాని అయిన హైద‌రాబాద్‌ ను వ‌దిలి ప‌రిపాల‌న కారణాల రీత్యా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాయ‌భారం ఫ‌లించేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప్ర‌స్తావ‌న హైద‌రాబాద్‌ లోని ఏపీ ప‌రిధిలో గల భ‌వ‌నాల గురించి! సాధారణంగా శాసనసభా బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్ర గవర్నర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించే అనవాయితీ ఉంది. రాష్ట్రం విడిపోయాక గవర్నర్‌ ప్రసంగాన్ని కొత్త అసెంబ్లీ భవనంలోనే నిర్వహిస్తూ వచ్చారు. బడ్జెట్‌ సమావేశాలను ఏపీ ప్రభుత్వం అమరావతిలో జరిపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో పాత అసెంబ్లి భవనాన్ని తమకు అప్పగిస్తారన్న నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ పాత భవనంలోనే గవర్నర్‌ ప్రసంగాన్ని జరపాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అసెంబ్లి భవనాలతో పాటు సచివాలయం, తొమ్మిది, పది షెడ్యూల్డ్ ఆస్తులకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులతో ఏర్పాటయిన కమిటీ గవర్నర్‌ సమక్షంలో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు సార్లు ఈ సమావేశాలు కొనసాగాయి. స్నేహపూర్వక వాతావరణం లో సమస్యలు పరిష్కరించుకుందామని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. తిరిగి ఈ నెల 26న మరోసారి రాజ్‌ భవన్‌ లో మంత్రుల కమిటి సమావేశం కాబోతుంది.

కాగా, సచివాలయ భవనాలతో పాటు అసెంబ్లి భవనాలు అప్పగింతను ఇప్పట్లో చేయరాదన్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చిందని స‌మాచారం. విజయవాడలో ఇటీవల జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరైన గవర్నర్‌ సచివాలయ భవనాల అప్పగింతకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా ఈ విషయంలో తాను ఒక్కడిని ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని, మంత్రి వర్గ సహచరులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని చంద్రబాబు గవర్నర్‌ కు స్పష్టం చేశారని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఏపీ మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి భవనాలను ఇచ్చే అంశంపై ఆయన మంత్రుల అభిప్రాయాలను సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భవనాలను అప్పగించే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, తొలుత విభ జన చట్టంలోని 9 - 10 షెడ్యూల్ల అంశాలను తేల్చాకే మిగతా అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్‌ మంత్రులు వ్యక్తం చేసినట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉందని ఏపీ సచివాలయం భవనాల్లో కొన్ని ముఖ్యమైన దస్త్రాలతో పాటు సామాగ్రి ఉందని వాటిని తరలించకుండా భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఎలా ఇస్తామని పలువురు ఏపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 9 - 10 షెడ్యూ ల్లోని సంస్థల విభజన జరగవల్సి ఉందని, ఇందులో ఉన్న ఆస్తులను జనాభా ప్రాతిపాదికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం ఇవ్వాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని, దాని ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను విభజించవల్సి ఉందని ఈ ప్రక్రియ పూర్తవుతేనే భవనాల అప్పగింత కు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తామని వారు అంటున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ సారి కూడా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగాన్ని యధావిదిగా కొత్త అసెంబ్లీ భవనంలోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదే స‌మ‌యంలో ఏపీకి కేటాయించిన అసెంబ్లీ భవనాలను క్యాంపు కార్యాల యంగా వినియోగించుకోవాలన్న నిర్ణయానికి శాసనసభా స్పీకర్‌ కొడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్‌ చక్రపాణి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న గవర్నర్‌ సమక్షంలో జరిగే సమావేశంలోనే భవనాలను అప్పగించే అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువ‌డుతుంద‌నే ఉత్కంఠ‌లో తెలంగాణ సీఎం ఉన్న‌ట్లు చెప్తున్నారు. భవనాల అప్పగింతపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి నిర్ణయం జరగకపోతే ఈ దఫా అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలను కొత్త అసెంబ్లీ భవనంలోనే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైనట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/