Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇలాకాలోనే..ఆయ‌న క‌ల‌ల ప్రాజెక్టుకు షాక్‌

By:  Tupaki Desk   |   14 Nov 2017 11:30 PM GMT
కేసీఆర్ ఇలాకాలోనే..ఆయ‌న క‌ల‌ల ప్రాజెక్టుకు షాక్‌
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు మెద‌క్ జిల్లాకు ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న పుట్టి పెరిగిన జిల్లాగానే కాకుండా..ఉద్య‌మ‌కాలంలో కేసీఆర్‌ కు వెన్నుద‌న్నుగా నిలిచింది కూడా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా గుర్తింపు పొందింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు గురించి కూడా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ముఖ్య‌మంత్రి పీఠం చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల్లో కొత్త జిల్లాల‌ ఏర్పాటు ఒక‌టి. త‌న హ‌యాంలో ఎలాంటి వివాదాలు లేకుండా చ‌రిత్ర సృష్టించేందుకు వేదిక‌గా నిలిచింది కొత్త జిల్లాల‌ ఏర్పాటు అని కేసీఆర్ ఎన్నో సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు అదే ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యం కేసీఆర్ సొంత జిల్లాలో న‌వ్వుల‌ పాల‌వుతోందని చ‌ర్చ జ‌రుగుతోంది.

కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం అట్ట‌హాసంగా సంబ‌రాలు సైతం చేసింది. అయితే ఏడాది గ‌డిచినా...వార్షికోత్స‌వాలు చేసిన ఇంకా అనేక క‌లెక్ట‌రేట్లు స‌మ‌స్య‌ల్లో కునారిల్లుతున్న ప‌రిస్థితి ఉంది. స‌రిప‌డా ఉద్యోగులు లేక‌పోవ‌డం, భ‌వ‌నాలు అందుబాటులో లేక‌పోవ‌డం వంటివి ప‌లు చోట్ల ఉన్నాయి. అయితే కేసీఆర్ ఇలాకా అయిన మెద‌క్ జిల్లాలో ప‌రిస్థితి భిన్నంగా ఇంకా చెప్పాలంటే చిత్రంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాలు ఏర్పడి సమీకృత కలెక్టరేట్‌ భవనాలకు శంకుస్థాపనలు జరుగుతున్నా కొత్తగా ఏర్పడిన మెదక్‌ జిల్లాలో కలెక్టరేట్‌ భవనానికి మోక్షం లభించడం లేదు. కొత్త జిల్లాల్లో ఇది వరకే స్థలాలు ఎంపిక చేసి టెండర్లు దాఖలు కాగా మెదక్‌ జిల్లాలో మాత్రం రాజకీయ బంధంలో స్థలం ఎంపిక కూడా జరగకపోవడం గ‌మ‌నార్హం.

నవంబర్‌ మొదటివారంలోనే కలెక్టరేట్‌ కు స్థలం ఎంపిక జరుగుతుందని, చివరి వారంలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని గ‌త నెల‌లో ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి ప్ర‌క‌టించారు. అయితే...న‌వంబ‌ర్ రెండవ వారం ముగిసిపోతున్న‌ప్ప‌టికీ అడుగుపెట్టినా ఇంకా స్థలం ఎంపిక జరగలేదు. సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి ప్రధానంగా రెండు ప్రాంతాల్లో స్థలాల ఎంపికకు జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అయితే పట్టణ శివారులోని రెండు ప్రాంతంలో స్థలాలను పరిశీలించారు. ఈ రెండింటిలో ఏదోఒక ప్రాంతంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణం కొనసాగనుంది. అయితే మొదటినుంచి కలెక్టరేట్‌ స్థలం ఎంపికపై సందిగ్ధత నెలకొంది. రాజ్‌ పల్లి ప్రాంతంలో నిర్మించాలని టీఆర్‌ ఎస్‌ వర్గాలు ఒత్తిడి తీసుకువస్తుండగా ఔరంగాబాద్‌ ప్రాంతంలో అయితే బాగుంటుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు కాకుండా ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో కలెక్టరేట్‌ నిర్మిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో అఖిలపక్షం నాయకులు సంతకాల సేకరణ కూడా చేపట్టారు. అయితే ఆర్డీవో కార్యాలయం ఆవరణలో కలెక్టరేట్‌ నిర్మాణానికి అధికారపక్షం నాయకులు ససేమిరా అనడంతో రాజ్‌పల్లి, ఔరంగాబాద్‌ ప్రాం తంలోనే కలెక్టరేట్‌ నిర్మాణం చేసేందుకు కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపించారు. . ఏదిఏమైనా ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలో అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య విబేధాల వల్ల కలెక్టరేట్‌ స్థలం ఎంపిక ఆలస్యం కావడం ఆస‌క్తిక‌రంగా మారింది.