Begin typing your search above and press return to search.

కేసీఆర్ తీపిక‌బురు కూడా షాక్ కొడుతోంది

By:  Tupaki Desk   |   30 April 2016 10:41 AM GMT
కేసీఆర్ తీపిక‌బురు కూడా షాక్ కొడుతోంది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు భిన్న‌మైన వ్య‌క్తిత్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీలో వేస్తున్న అడుగులు గులాబీ నేతలను కలవరపెడుతున్నాయి. ఒక‌ప‌క్క కేసీఆర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూనే....మ‌రోప‌క్క త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వాపోతున్నారు.

అనేకసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభం కావ‌డం గులాబీ క్యాడర్ లో గుబులు రేపుతోంది! పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టికే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కార్పొరేషన్ పదవులు ఇస్తుండడంతో తమ పరిస్థితి ఏంటని నాయ‌కులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ రాక నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి మరీ దారుణం. మార్కెట్ కమిటీ పదవుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో ముందు రెడీ చేసిన జాబితాలోని పేర్లన్ని మాయం అయ్యాయంటున్నారు. దీంతో పదవుల జాతర ప్రారంభం కావడంపై సంతోషించాలో… పదవి రానందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో నేతలు ఉన్నారు.

ఇదిలాఉండ‌గా నామినేటెడ్ ప‌ద‌వుల కోసం ఆశావాహులు - సమర్థులైన నేతల జాబితాను రెడీ చేయాలని మంత్రులు, సీనియర్ నేతలను ఆదేశించిన కేసీఆర్ ఈ క్ర‌మంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సొంతంగా సర్వే చేయించకున్న కేసీఆర్‌...సర్వే రిపోర్టు ప్రకారమే పదవులు ఇస్తున్నారని అంటున్నారు. ప్రజలతో మంచి సంబంధాలున్న వారికే సీఎం ప్రాధాన్యం ఇస్తుండటంతో ఏం చేయాలో తెలియక పరేషాన్ అవుతున్నారు. పైరవీలు మానేసి గ్రౌండ్ లెవల్లో పార్టీకి పనిచేయాలని నేతలు డిసైడ్ అవుతున్నారు. నాలుగువేలకుపైగా నామినేటెడ్ పోస్టులుంటాయని సీఎం చెప్పడంతో నమ్మకంగా పనిచేస్తే ఏదో ఒకటి రాకపోతుందా అని భావిస్తున్నారు.