Begin typing your search above and press return to search.

వారితోనే కేసీఆర్‌ కు చిక్కులు..!

By:  Tupaki Desk   |   6 Sep 2017 5:30 PM GMT
వారితోనే కేసీఆర్‌ కు చిక్కులు..!
X
దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భ‌వించింది. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. నాటి నుంచి క్రమంగా బంగారు తెలంగాణ దిశగా ప‌య‌నిస్తున్నామ‌న్న‌ ప్రచారం హోరెత్తుతూనే ఉంది. ప్రతి కొత్త కార్యక్రమం - పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్షను ఎండగ‌డుతూ.. చెప్తే పెద్ద కథైతది అంటూ త‌నదైన స్టైలులో తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా ప్ర‌సంగిస్తారు. అయితే కేసీఆర్ మాటలు - ఆయ‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు తెలంగాణ‌ను.. బంగారు తెలంగాణ‌కు చాలా దూరంలోనే ఉంచేస్తున్నాయా..? కేసీఆర్ మాట‌ల‌కూ చేత‌ల‌కూ సంబంధ‌మే లేదా..? ఆయన సారథ్యంలో సొంత రాష్ట్రంలోనే దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతోందా..?

తెలంగాణ సిద్ధించాక తొలి స్వాతంత్ర్య వేడుక‌లు 2014 ఆగస్టు 15వ తేదీన గోల్కొండ కోటలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం కేసీఆర్ పేద దళితులంతా ఆత్మ గౌరవంతో బతకాలన్నదే తమ సర్కార్ విధానమని స్ప‌ష్టం చేశారు. అందుకు అనుగుణంగా దళితులకు వ్య‌వ‌సాయానికి అనుకూల‌మైన‌ మూడెకరాల భూమి పంపిణీ చేస్తామ‌ని త్రివ‌ర్ణ ప‌తాకం సాక్షిగా ప్రక‌టించారు. అయితే మూడేన్న‌రేళ్లు గ‌డిచినా.. దళితుల మూడెకరాల భూమి ప్ర‌క‌ట‌న అమ‌లు కాలేదు.

ఆదిలాబాద్ - కరీంనగర్ జిల్లాల పరిధిలో అర్హులైన దళితులు తమకు భూమి పంపిణీ ఎప్పుడని నిలదీస్తున్నారు. ఆందోళన బాట పడుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ అర్హులైన దళితులు తమకు ప్రభుత్వం ఎప్పుడు భూమి పంపిణీ చేస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క‌రీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నం చేశారు. మరోవైపు లబ్దిదారుల ఎంపిక కూడా ఒక ప్రహసనంగా మారింది. నిరుపేద దళితులకు కాక.. ఇప్ప‌టికే భూమి ఉన్న వారినీ జాబితాలో చేర్చార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అధికారుల‌కు రూ.20 నుంచి రూ.50 వేలు సమర్పించుకుంటేనే జాబితాలో పేర్లు ఉంటున్నాయ‌ని దళితులు ఆరోపిస్తున్నారు.

దళితబస్తీ పథకంలో వ్యవసాయ భూమిని విక్రయించేందుకు దరఖాస్తు చేసుకున్న రైతుతోపాటు ఎంపికైన ఎస్సీ నిరుపేద లబ్ధిదారులకు మధ్య కొందరు దళారులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు దళారుల అవతారమెత్తి పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అలా చేయని పక్షంలో లబ్ధిదారుల పేర్లను జాబితాలో నుంచి తొలగిస్తామని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వారి మాటలను విని లబ్ధిదారులు భూమి పట్టా చేతికందక ముందే వారి డిమాండ్లకు తలొగ్గి అప్పు పాలై మరీ వారి పర్సంటేజీలను అందజేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండ‌గానే.. జూలై 2వ తేదీ సిరిసిల్ల జిల్లాలో జ‌రిగిన‌ నేరెళ్ల ఘ‌ట‌న కూడా కేసీఆర్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చింది. ఆ గ్రామంలో ఇసుక లారీల కింద పడి భూమయ్య అనే వ్యక్తి మరణించ‌డంతో ఆగ్రహించిన స్థానికులు లారీ దగ్ధం చేయడం.. ఆ పై పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ క్ర‌మంలో ఆందోళనకారులను చిత్ర హింసల పాల్జేసిన ఘటన జాతీయస్థాయిని ఆకర్షించింది. లోక్‌ సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డంతో నేరెళ్ల సమస్యపై దేశమంతా ద‌ృష్టిసారించింది. అయితే.. మూడేళ్లలోనే పరిస్థితులు తారుమారు కావడానికి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల దూకుడు వ్యవహారం ప్రభుత్వానికి బొప్పిగట్టించింది. ప్రభుత్వ కనుసైగ లేకుండానే పోలీసులు దూకుడుగా వ్యవహరించారని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కనుక ప్రభుత్వమే ప్రజల ముందు తొలి ముద్దాయిగా నిలిచిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రతిపక్షాల బలహీనతలను చూసి - తనకు వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండ‌క పోవ‌చ్చ‌ని.. టీఆర్ ఎస్ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని బహుశా కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు. కానీ, వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆయన ప్ర‌భుత్వాన్ని దోషిగా చూపుతున్నాయి. తాజాగా ఉమ్మడి హైకోర్టు నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయి..? వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణం ఏమిటి..? బాధితులందరికీ ఒకే తరహాలో గాయాలు ఎలా అవుతాయి..? రెండు వైద్య నివేదికల్లో తేడాలు ఎందుకు ఉన్నాయి..? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నో ఆశ‌ల‌తో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో త‌మ స‌మ‌స్య‌ల‌న్నీ తెలిసి, త‌మ కోసం పోరాడిన వ్య‌క్తి నేత‌ృత్వంలోని ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఈ ప‌రిస్థితి ఉంటే త‌మ‌కు దిక్కేంట‌ని బాధితులు వాపోతున్నారు. రాజ‌కీయం వేరు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వేరు. ఇప్ప‌టికైనా ప్ర‌తిప‌క్షాల‌పై ఒంటికాలిపై లేచే బ‌దులు.. త‌మ స‌మ‌స్య‌లపై ద‌ృష్టి సారించాల‌ని కోరుతున్నారు. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కారు స్పీడుకి బ్రేకులు ప‌డ‌తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.