Begin typing your search above and press return to search.

ఈ మెజార్టీల అర్ధమేమిటి పరమేశా... !?

By:  Tupaki Desk   |   11 Dec 2018 1:37 PM GMT
ఈ మెజార్టీల అర్ధమేమిటి పరమేశా... !?
X
సిద్ధిపేటలో లక్షా ఇరవై వేలు... సిరిసిల్లలో 89 వేలు... మేడ్చల్ లో 85 వేలు... మక్తల్ లో 47 వేలు... ముషీరాబాద్ లో 38 వేలు... జుక్కల్ లో 38 వేలు... ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గజం ధర అనుకుంటున్నారా....? కానే కాదు... ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు సాధించిన మెజార్టీలు.

ఇక కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వారికి వచ్చిన మెజార్టీ ఎంత అనుంటున్నారా. కేవలం పది వేల లోపే. కొందరైతే వందల ఓట్లతోనే గెలుపొందారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు . దాంతోపాటే 105 మంది సిట్టింగ్ అభ్యర్దులకు కూడా టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాజకీయ పరిశీలకులలోను - తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులలోను తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సిట్టింగులను మార్చాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓ అంతర్గత వ్యతిరేకతే వచ్చింది. అయితే వారిని మార్చకపోతే ఓటమిపాలు కావడం తథ్య‌మంటూ విశ్లేషణలు వచ్చాయి. అయినా ఒకసారి తీసుకున్న నిర్ణయానికి వెనకడుగు వేసేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షడు కె. చంద్రశేఖర రావు ప్రకటించారు.

టిక్కెట్టు రాని రెబల్స్‌ ను బుజ్జగించే పనిని తన తనయుడు కేటీఆర్‌ కు అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సిట్టింగ్‌ లతో పాటు సీనియర్ నాయకులకు వచ్చిన మెజారిటీ చూస్తే అధికార పార్టీ వైపు ప్రజలు ఎంత ఆకర్షితులయ్యారో వెల్లడయింది. తమ అభ్యర్దులను కాకుండా తనను చూసి ఓటేయాలంటూ కేసీఆర్ చేసిన విన్నపం ఫలించింది. దీనికి తార్కాణ‌మే వేలాది ఓట్ల మెజారిటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మహాకూటమి త‌ర‌ఫున‌ గెలిచిన వారి మెజారిటీ 10,000 లోపు. ఆ మాటకు వస్తే కొంద‌రికి రెండు మూడు వేల లోపే ఉండడం విశేషం. తెలంగాణ ఓటర్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఎంతలా అక్కున చేర్చుకున్నారో ఈ మెజారిటీలే నిరూపిస్తున్నాయి.