Begin typing your search above and press return to search.

చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?

By:  Tupaki Desk   |   30 Aug 2016 4:26 PM GMT
చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా? పాతపాపం ఇప్పుడు తిరగతోడబడుతున్నదా? ఓటుకు నోటు కేసు విషయమై ఏసీబీ కోర్టులో తాజాగా కేసు మళ్లీ పడడం - విచారణకు న్యాయమూర్తి ఆదేశించడం నిన్నటి కీలక పరిణామాలు. అయితే తాజాగా ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది.

మంగళవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ - సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ తో దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం అయ్యారు. కేసీఆర్‌ గవర్నర్‌ తో ప్రధానంగా ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ను విచారించవలసి వచ్చే అంశం గురించే చర్చించినట్లుగా బయటపుకార్లు వ్యాపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ - గవర్నర్‌ తో భేటీలో ఉన్న సమయంలోనే అక్కడకు తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ - అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. వారు కూడా వీరితో కలిసి భేటీ అయి పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. నిజానికి ఈ ఇద్దరూ గవర్నర్‌ బంగళాకు అదే సమయంలో వచ్చినందునే.. వ్యవహారం మొత్తం ఓటుకు నోటు కేసు - చంద్రబాబు మీద విచారణకు ఆదేశాల వ్యవహారం మీద జరుగుతున్నదనే అనుమానాలు బయటి వారికి వస్తున్నాయి. గతంలోనూ ఈ ముగ్గురూ రాజ్‌ భవన్‌ కు వెళ్లారంటే.. ఓటుకు నోటు కేసు వ్యవహారాల్లో మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడడాన్ని బట్టి.. ఉచ్చు బిగుస్తున్నదేమోనని.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబునాయుడుకు చేదు అనుభవాలు ముందుముందు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.