Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'రాజ‌' యాగం..ఆ త‌ర్వాతే రంగంలోకి

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:21 AM GMT
కేసీఆర్ రాజ‌ యాగం..ఆ త‌ర్వాతే రంగంలోకి
X
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు యజ్ఞయాగాదులపై ఉన్న మ‌క్కువ‌ - విశ్వాసం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రువుతో అల్లాడుతున్న రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఆయత మహా చండీయాగాన్ని 2015లో చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనంత గొప్పగా.. ఆయత మహా చండీ యాగాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి పవిత్ర ధనుర్మాసమైన డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రం సమీపంలోని 22 ఎకరాల్లో చండీయాగం చేశారు. కేసీఆర్ అత్యంత గౌర‌వించే త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలోనే ఈ యాగం నిర్వహించారు. ఈ యాగంలో దేశ నలుమూలల నుంచి 1100 మంది వేదపండితులు - పీఠాధిపతులు పాల్గొననున్నారు.

అదే రీతిలో తాజాగా మరో యాగానికి కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. ఎన్నికల్లో గెలుపు - ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజా శ్యామల చండీహోమం - చండీ సహిత రుద్ర హోమం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ - రేపు ఆయన ఆ వైదిక కార్యక్రమాలు జరిపిస్తున్నారు. విశాఖ స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 48 మంది ఋత్విక్కుల సమక్షంలో రాజశ్యామల హోమం నిర్వహించనున్నారు. శృంగేరీ ఆస్థాన పండితులు ఫణిశశాంక్‌ శర్మ - గోపీ కృష్ణశర్మ ఆధ్వర్యంలో 72 మంది ఋత్విక్కులు మహారుద్రసహిత చండీయాగం నిర్వహిస్తారు. సోమవారం మధ్యాహ్నం పూర్ణాహుతి పూర్తయ్యాక కేసీఆర్‌ ఎన్నికల సభలకు బయలుదేరి వెళ్తారు.

కాగా, నామినేషన్ల పర్వం ముగిసే చివరి రోజు నుంచే పార్టీ అధినేత కెసిఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 19న ఖమ్మం - పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం పట్టణంలో నిర్వహించే సభతో ఈ సుడిగాలి పర్యటన ప్రారంభమవుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే నియోజకవర్గ సభల రెండు రోజుల షెడ్యూల్‌ ను టీఆర్ ఎస్ పార్టీ విడుద‌ల చేసింది. ఈ నెల 19 - 20 తేదీలలో ఖమ్మం - కరీంనగర్ - సిరిసిల్ల - జనగామ జిల్లాల్లో పార్టీ అధినేత కెసిఆర్ హెలికాప్టర్ ద్వారా ఆరు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తమ నియోజక వర్గాలలో బహిరంగ సభలను నిర్వహిం చాలని అభ్యర్థులు అధినేతను కోరారు. ఈ ఆరు సభల ద్వారా మరింత ఉత్సాహం నిండనుంది.