Begin typing your search above and press return to search.

కేసీఆర్ - జగన్ పోటీపడుతున్నారా?

By:  Tupaki Desk   |   21 July 2019 1:30 AM GMT
కేసీఆర్ - జగన్ పోటీపడుతున్నారా?
X
ఏదీ శాశ్వతం కాదు - ఐడియాలు కూాడా అంతే. ఇప్పటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రధాన మంత్రులయ్యారు - ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే తమ పదవులు ఎంత పవర్ ఫుల్ అనేది అర్థం చేసుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ ప్రత్యకత నిలుపుకున్నారు. కొందరు సుదీర్ఘ అనుభవం తర్వాత గ్రహిస్తే - కొందరు అసలు ఎప్పటికీ గ్రహించలేకపోయారు. ఇంకొందరు అనుభవం లేకుండా సంచలన పాలన అందించారు. ఈ సంచలన జాబితా చాలా చిన్నది. నిజంగానే చిన్నది.

ప్రధానమంత్రులను తీసుకుంటే... అప్పట్లో ఇందిరాగాంధీ - ఆ తర్వాత నరేంద్రమోడీ మాత్రమే ఆ సీటు ఎంత పవర్ ఫుల్ అనేది గ్రహించారు. వారు అనుకున్నది సాధించారు. కొన్ని తప్పులు చేశారు - ఎన్నో అద్భుతాలు - రికార్డులు సృష్టించారు. ప్రధాన మంత్రిగా మిగతా వారిలో కొందరు మంచి పాలకులు అయితే అయ్యారు గాని పవర్ ఫుల్ పాలకులుగా పేరు తెచ్చుకున్నది మాత్రం ఇందిర - మోదీ మాత్రమే. అదే విధంగా ముఖ్యమంత్రుల్లో కొందరు మాత్రమే తమ పవర్ ను గ్రహించారు. ఎన్టీఆర్ అసలు రాజకీయ అనుభవం లేకుండా ప్రజల్లో ఎలా చిరస్థాయిగా నిలిచిపోవాలో తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనతో ప్రజలను - రాజకీయంతో నేతలను తనతో అట్టిపెట్టుకున్నారు. ఇదంతా గతం.

వర్తమానంలో కేసీఆర్ - జగన్ లు పవర్ లో సూక్ష్మాన్ని అనతి కాలంలోనే గ్రహించారు. ఇద్దరూ సమకాలికులు కాకున్నా ప్రజల మనసు దోచుకోవడంలో సమంగా పోటీపడుతున్నారు. అప్రహతిహతమైన విజయాలను సొంతం చేసుకుని పార్టీపై పట్టును - ప్రజల్లో ప్రేమను ఏకకాలంలో పొందారు. సంక్షోభాలను ముందే ఊహించి సుదీర్ఘ ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాల ఊహకు కూడా అందకుండా వ్యూహాలు రచిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రజలు - ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం కదా ఆర్నెల్లు టైం ఇద్దామా - వద్దా అని ఇంకా చర్చలో ఉంటే... వీరు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పథక రచన చేస్తున్నారు. నేటి ప్రజల మనసులు తెలుసుకుని - శాశ్వతంగా అధికారం చేజిక్కించుకోవాలో గురిచూసి కొడుతున్నారు.

కేసీఆర్ నే తీసుకుంటే... అనితర సాధ్యమైన టాస్కు తెలంగాణను సాధిస్తే బొటాబొటి మెజారిటీతో గెలిచాడు కేసీఆర్. కానీ ఐదేళ్లలో తన వ్యూహాలతో రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచి మహాకూటమిని మట్టికరిపించాడు. ప్రజల బలమైన కోరిక వ్యవసాయం - సామాజిక అవసరాలు - మంచినీటి సదుపాయం - సాగునీటి పారుదల - సౌకర్యవంతమైన ఇళ్లు - ఆసరా లేని వారికి ఆర్థిక అండదండలు - సామాజిక వర్గాల వారిగా ప్రయోజనాలు కల్పించి ప్రతి వర్గానికి చేరువయ్యే టెక్నిక్ ను ఛేదించారు కెేసీఆర్. రైతు బంధు - మిషన్ భగీరత - పెళ్లికి ఆర్థిక సాయం - రైతు భీమా - పంటలకు సాగునీరు ఇచ్చి ప్రజల ప్రేమను పొందారు. సులువుగా ఎన్నికల లక్ష్యాన్ని అధిగమించారు. అందుకే ఫిరాయింపులకు పాల్పడినా ప్రజల్లో కేసీఆర్ కు క్రేజ్ తగ్గలేదు.

కేసీఆర్ తో పోల్చుకుంటే జగన్ రాజకీయ అనుభవం తక్కువ. కాకపోతే టార్గెట్ మాత్రం బలంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి వార్డు యూనిట్ గా నేరుగా పార్టీకి ప్రజలతో సంబంధాలు ఉండేలా నెట్ వర్క్ బిల్డ్ చేస్తున్నాడు జగన్. అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ ని ప్రభావితం చేయలేని స్థాయిలోకి పార్టీని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు... ప్రతి ఇంటికి తన ప్రభుత్వం వల్ల మేలు జరిగేలా జాగ్రత్తపడుతూ - అలాగే అన్ని వర్గాలకు సమంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఇలా కేసీఆర్ - జగన్ ఇద్దరు ఎవరికి వారే నేరుగా ప్రజల మనసులు గెలవడంలో మాస్టర్స్ చేస్తున్నారు.