Begin typing your search above and press return to search.

కేసీఆర్ వాదన సెంటిమెంటు ఒక్కటే

By:  Tupaki Desk   |   30 July 2015 6:16 PM GMT
కేసీఆర్ వాదన సెంటిమెంటు ఒక్కటే
X
హైదరాబాద్ పై మాట్లాడే హక్కు తమకే ఉందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. హైదరాబాద్ కు ఉదయాన్నే లేవడం ఎన్టీఆర్ నేర్పారంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలనూ ఆయన సమర్థించుకున్నారు. తన వ్యాక్యల్లో ఎటువంటి తప్పు లేదని కూడా తేల్చి చెప్పారు.

నిజానికి హైదరాబాద్ కు గతంలోనే అంతర్జాతీయ ఖ్యాతి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదంతా నిజాం హయాంలో పరిస్థితి. నిజాం తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఎన్టీ రామారావు వచ్చే వరకు హైదరాబాద్ పరిస్థితి వెనకబాటులోనే ఉంది. ఎన్టీ రామారావు వచ్చి ఏపీకి మరీ ముఖ్యంగా హైదరాబాద్ కు దేశీయంగా ఖ్యాతి తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చి హైదరాబాద్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఎవరెంత చెప్పినా అబద్ధమే అవుతుంది.

హైదరాబాద్ ను మరీ ముఖ్యంగా తెలంగాణను తాము అభివృద్ధి చేశామని చెప్పడానికి తాము కొన్ని పేజీల పథకాలను చెబుతామని, కొన్ని పేజీల కట్టడాలను చూపిస్తామని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్కటి చూపించగలరా అని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. నిజానికి ఔటర్ రింగు రోడ్డు, సైబారబాద్, హైటెక్ సిటీ, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో భవనాలను చంద్రబాబు నాయుడు కట్టించారు. అయితే, కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ఒకే మాట చెబుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ తాము దీనిని అభివృద్ధి చేశామని చెప్పుకొనేందుకు వాళ్లకు ఒక్కటంటే ఒక్కటికూడా లేదని, అందుకే హైదరాబాద్ అంటే తెలంగాణ అని, తెలంగాణ అంటే హైదరాబాద్ అంటూ దీని విషయంలో కూడా సెంటిమెంటును రగల్చడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా హైదరాబాద్ కు తాము ఇది చేశామని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ కు ఏమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు.