Begin typing your search above and press return to search.

క్యాష్ కోసం కేసీఆర్ తిప్పలు

By:  Tupaki Desk   |   13 Oct 2015 6:35 AM GMT
క్యాష్ కోసం కేసీఆర్ తిప్పలు
X
రిచ్ స్టేట్ గా గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం పైసల కోసం వెతుక్కుంటోందట... గత రెండు వారాలుగా ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదట. పెట్టెలో డబ్బు అయిపోవడంతో మళ్లీ నిండేవరకు ఎలాంటి బిల్లులు చెల్లించొద్దంటూ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.

ఇప్పటికే పది వేల కోట్ల మేర ఈ ఏడాది బాండ్ల అమ్మకం ద్వారా రుణాలు సేకరించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి బాండ్ల రిలీజ్ కు సిద్ధమవుతోంది.ఆశించిన మేర ఆదాయం లేకపోవడం - బడ్జెట్ కు - అంచనాలకు చాలా తేడా ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బిల్లుల నిలుపుదల చేసిందని కదనం.ఉద్యోగుల సిబ్బంది, పెన్షన్లు మినహా మరే చెల్లింపులు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు.దీనితో ఫీజ్ రీయింబర్స్ మెంట్ , వితంతు పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి.

మరోవైపు ఇలా ఎంతోకాలం నడిపించలేమన్న సత్యం తెలిసిన టీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మూడు నెలల కాలంలో కనీసం రూ. 4 వేల కోట్లు రుణరూపేణా రాబట్టాలనే దిశగా తెలంగాణ ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది. నాలుగు వేల కోట్ల రూపాయలలో దాదాపు 1201కోట్ల రూపాయలను సెక్యురిటీ బాండ్లను విక్రయించడం ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ముంబయిలో మంగళవారం జరిగే వేలంలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. మొత్తానికి కేంద్రం నుంచి.... బాండ్ల వేలం ద్వారా ఆదాయం ఎలాగైనా పొందాలని... లేదంటే ఇబ్బందులు ఖాయమని తేలడంతో కేసీఆర్ ప్రభుత్వం కిందామీద పడుతోంది.