Begin typing your search above and press return to search.

యోగికి కేసీఆర్ సెటైర్‌...బీజేపీలో మార్పు వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   13 Dec 2018 8:24 AM GMT
యోగికి కేసీఆర్ సెటైర్‌...బీజేపీలో మార్పు వ‌స్తుందా?
X
ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌చార ప‌ర్వంలో అనేక ప‌ద‌నిస‌లు చోటుచేసుకున్నాయి. సంచ‌ల‌న ప‌రిణామాల‌తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ‌లో అడుగుపెట్టిన సంద‌ర్భంగా కూడా అదే ఒర‌వ‌డి కొన‌సాగించారు. ఎన్నికల ప్రచారంలో జిల్లాకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కరీంనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బండి సంజ‌య్‌ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే...కరీంనగర్ జిల్లా పేరును కరిపురంగా మారుస్తామని వెల్లడించారు. యోగి ఇలా ప్ర‌క‌టించ‌డం కలకలం రేపుతోంది.

దీనిపై గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ స్పందిస్తూ ``హైద‌రాబాద్ పేరు మారుస్తా..తోక‌ మారుస్తా అన్న‌వారు ఏరి? ` అంటూ ప‌రోక్షంగా యూపీ సీఎంపై సెటైర్లు వేశారు. అంతేకాకుండా మైనార్టీల భద్రతలో హైదరాబాద్ ముందుందని - ఈ విషయంలో హైదరాబాద్‌ ను దేశానికి మోడల్‌ గా చూపుతామని చెప్పారు. ఇక్క‌డ మ‌త రాజ‌కీయాలు చెల్ల‌బోవ‌న్నారు. కాగా, తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ హిందూత్వవాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని భావించింది. హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. అయినప్పటికీ సిట్టింగ్ స్థానాల్లోనూ ఓడిపోయింది. కేవ‌లం ఒక్క చోటే ఆ పార్టీ గెలుపొందింది. ఓడిన వారిలో రాష్ట్ర అధ్య‌క్షుడు - శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ - మ్యానిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ ఉండ‌టం ఆ పార్టీ స్థితికి నిద‌ర్శ‌నం.

తెలంగాణ‌తో స‌హా ఐదు రాష్ర్టాల ఫ‌లితాల‌ను గ‌మ‌నించిన వారు బీజేపీ సిద్ధాంతాల విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆదిత్యనాథ్ ప్రసంగాలతో తెలంగాణ ఓటర్లు ఏమాత్రం ప్రభావితం కాలేదు. హైదరాబాద్ పేరు మారుస్తామని - నిజాం ప్రభువు పారిపోయినట్టు ఒవైసీలు పారిపోతారంటూ చేసిన ప్రసంగాలు హైదరాబాద్ వాసులను ఆకట్టుకోలేదు. ఇటీవ‌లి కాలంలో బీజేపీ తీరుతో కరుడుగట్టిన హిందూత్వ వాదులు సంతృప్తి పొంది ఉండవచ్చు.. కానీ ప్రభుత్వాలపై ప్రజలకున్న ఆగ్రహాన్ని అవి చల్లార్చలేకపోయాయని రాజస్థాన్ ఫలితాలలో వెల్లడైందంటున్నారు. కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు మరికొందరిని దూరం పెట్టడంతో ఓటర్లు సీఎం వసుంధర రాజెకు మంచి గుణపాఠం నేర్పించారు. ద్వేషాన్ని రగిల్చే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి నేతల ప్రసంగాలు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ పై బీజేపీ ఆధారపడాలనుకుంటే ఆయనను ఎక్కడ ఉపయోగిస్తే తమకు లాభకరమో ముందే నిర్ణయించుకోవాల‌ని సూచిస్తున్నారు.