Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ నేతల వేడి కేసీఆర్ ను తాకింది

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:33 AM GMT
టీ కాంగ్రెస్ నేతల వేడి కేసీఆర్ ను తాకింది
X
పైకి పట్టించుకోనట్లుగా ఉంటారు కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన చుట్టూ ఏం జరుగుతుందన్న అంశంపై డేగకన్ను వేసి ఉంచుతారు. విపక్షాలకు ప్రచారం రాకుండా ఉండటంలో భాగంగా.. వారిపై తరచూ విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తనపై తరచూ విరుచుకుపడే పార్టీలపై ఆయన పెద్దగా స్పందించరు. రోజువారీగా స్పందిస్తే.. ఆ వ్యవహారం ఇద్దరి మధ్య పోరాటంగా మారి.. ప్రజల ఫోకస్ మరింత పెరుగుతుందని.. తనను విమర్శించే వారి మాటల్ని ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుందన్న వ్యూహంతో కేసీఆర్ ఆచితూచి మాత్రమే స్పందిస్తుంటారు.

ఇందులో భాగంగానే.. విపక్షాల విమర్శలకు సంబంధించి కాస్తంత ఓపిక పట్టినట్లుగా కనిపిస్తూ.. టైం చూసుకొని మరీ చెలరేగిపోయే వైనం కనిపిస్తుంది. ఒకేసారి మొత్తంగా తాట తీసేలా.. అప్పుడప్పడు చాకిరేవును పెడుతుంటారు. ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తుతున్న పాయింట్లు కొన్ని లాజిక్ గా ఉండటమే కాదు.. నిజమే కదా.. అన్నట్లుగా ఉండటం కనిపిస్తుంది. నిత్యం ధనిక రాష్ట్రమని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. బిల్లుల చెల్లింపు..ఆరోగ్యశ్రీ.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలకు ఎందుకు నిధులు చెల్లించటం లేదన్న ప్రశ్నలకు సూటిగా.. సంతృప్తికరంగా సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఈ విషయాన్ని గుర్తించి కేసీఆర్.. తాజాగా అధికారులకు ఒక టార్గెట్ పెట్టారు. ఓపక్క రాష్ట్ర అభివృద్ధి బాగున్నా.. రాబడులు అనుకున్నట్లే వస్తున్నా.. చెల్లింపుల విషయంలో జాప్యం చోటు చేసుకోవటం.. దీని కారణంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు పెరుగుతున్న వేళ.. ఇదంతా ఎందుకు జరుగుతుందన్న డౌట్ కేసీఆర్ కు వచ్చింది. దేశంలో ఆర్థికంగా గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నప్పటికీ.. చెల్లింపుల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉండటమే కాదు.. ఈ మధ్యన తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన వైనాన్నిప్రశ్నిస్తున్న కేసీఆర్.. రూపాయి రాక.. పోక విషయానికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

‘‘పైసలు ఉంటున్నాయని చెబుతున్నారు. కానీ.. చెల్లింపుల్ని నిలిపివేస్తున్నారు. బకాయిలు క్లియర్ కావటం లేదు. దీంతో.. ప్రభుత్వ కార్యక్రమాల అమలు నిలిచిపోయి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది’’ అంటూ విషయాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్.. ఎందుకిలా జరుగుతుందన్న విషయంపై తనకు ఆ సమాచారాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఒకవేళ.. బడ్జెట్ లో అనుకున్న రీతిలో ఆదాయం రాకుంటే.. పలు శాఖలకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కోత పెడదామంటున్న ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తరచూ తనను కార్నర్ చేస్తున్న బకాయిల చెల్లింపు నిలిపివేతపై కేసీఆర్ కన్ను పడినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్న అంశాలపై కేసీఆర్ సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటున్న వైనం తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు.