Begin typing your search above and press return to search.

రెవెన్యూ అధికారులకు కేసీఆర్ మార్క్ పరీక్ష

By:  Tupaki Desk   |   24 May 2016 4:54 AM GMT
రెవెన్యూ అధికారులకు కేసీఆర్ మార్క్ పరీక్ష
X
చూసేందుకు సింఫుల్ గా అనిపించినా.. కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టటం అంత చిన్న విషయం కాదు. నిజానికి దశాబ్దాల తరబడి ఎన్నో ప్రభుత్వాల్ని వదిలేసిన కొన్ని కార్యక్రమాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టటం తెలిసిందే. ఆలోచన చేయటానికి కూడా పలువురు ముఖ్యమంత్రులు ఇష్టపడని కార్యక్రమాల్ని కేసీఆర్ చేపట్టటమే కాదు.. వాటి అంతు చూడాలన్న లక్ష్యంగా పని చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

ఉమ్మడి రాష్ట్రంలో అసైన్డ్ భూముల్ని ఎవరికి వారు.. బలమున్న వారంతా సొంతం చేసుకోవటం అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. అయితే.. దీనిపై కొరడా ఝుళిపించేందుకు ఏ ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదనే చెప్పాలి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అసైన్డ్ భూముల్ని పేదలకు పంపిణీ చేసే కార్యక్రమం సుదీర్ఘంగా సాగటం. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల్ని పంచేస్తూ ఉంటుంది. నిజానికి అవి లబ్థిదారులకు చేరుతున్నాయా? లేదా? ఒకవేళ చేరితే అవన్నీ లబ్థిదారుల చేతుల్లోనే ఉన్నాయా? లేదా? ఒకవేళ.. లబ్థిదారుల చేతుల్లో అసైన్డ్ భూములు ఉంటే వాటిల్లో ఎంతమేర వ్యవసాయం జరుగుతుందన్న లెక్కలు తేలని పరిస్థితి.

ఈ విషయాల మీద ఉన్న గందరగోళానికి చెక్ చెప్పాలని డిసైడ్ అయిన కేసీఆర్.. తెలంగాణ రెవెన్యూ అధికారులకు పెద్ద పరీక్షే పెట్టారు. ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని అసైన్డ్ చేసి పేదలకు ఇచ్చినట్లుగా చెప్పే రికార్డుల మాటను క్రాస్ చెక్ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేవారు. ఇందులో భాగంగా.. అసైన్డ్ దారులకు ఇచ్చిన భూముల వివరాలు.. ఆ భూమిలో ఉన్న వారు వ్యవసాయం చేస్తున్నారా? లేదా? అంశాలతో పాటు.. ఎంత అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైంది? అన్నసమస్త వివరాల్ని జూన్ 30 నాటికి లెక్క తేల్చాలంటూ రెవెన్యూ అధికారులకు టార్గెట్ విధించారు. దశాబ్దాల తరబడి తంతుగా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన రెవెన్యూ లెక్కల్ని ఇంత స్వల్ప వ్యవధిలో అధికారులు లెక్క తేలుస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి పెట్టిన తాజా పరీక్ష రెవెన్యూ అధికారులకు చెమటలు పట్టించటం ఖాయమని చెప్పక తప్పదు.