Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచ‌ల‌నం..ఒక‌నెల జీతం గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   24 Feb 2018 3:41 PM GMT
కేసీఆర్ సంచ‌ల‌నం..ఒక‌నెల జీతం గిఫ్ట్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. త‌ను అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తుంటారు. అంతేకాకుండా...ఆయ‌న  ల‌క్ష్యాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. ఆలోచ‌న తీరు విభిన్నంగా ఉంటుంది. అలాంటి విభిన్న‌మైన నాయ‌కుడైన కేసీఆర్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం వెలువ‌రించారు. ఒక‌నెల జీతాన్ని ఉచితంగా అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు

నిజాం కాలం నాటి భూ రికార్డుల‌నే ఇటీవ‌లి వ‌ర‌కు కొన‌సాగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ఆ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌కు ఓకే చెప్పేశారు. మొద‌ట ఈ రికార్డుల ప్ర‌క్షాళ‌న సాఫీగా సాగుతుందా అనే సందేహాలు వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ...విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం - కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ - ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి - సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు - రాజేశ్వర్ తివారి - రామకృష్ణ రావు - శివశంకర్ - వాకాటి కరుణ - స్మితా సభర్వాల్ - కలెక్టర్లు సఘునందన్ రావు - ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్  మాట్లాడుతూ `దాదాపు 80 ఏళ్లుగా భూ రికార్డుల నిర్వహణ సరిగా లేదు. భూమి క్రయవిక్రయాలు - యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో భూ రికార్డులు గందరగోళంగా మారాయి. తెలంగాణలో పంట పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి - పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు - ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి - రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు - అసైన్డ్ దారుల విషయంలో కూడా స్పష్టత సాధించారు. రాష్ట్రంలో 22.5 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచగా - అందులో 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. మిగతా రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా విషయాల్లో పూర్తి సాధించారు. మమూలు సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’’ అని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం మంది అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చారు. `గతంతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో ఎంతో మార్పు వచ్చింది. కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎంతగానో కష్టపడడం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడింది. గతంలో రెండు లక్షల లోపే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేవి. ఇప్పుడా సంఖ్య చాలా పెరిగింది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, రోడ్ల నిర్మాణంలో పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులు, ఇంకా ఇతర శాఖల అధికారులు చాలా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు కూడా అత్యంత పారదర్శకంగా ఉన్నాయి. అవినీతికి ఆస్కారం ఇవ్వని విధంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు లభించాలన్నదే ప్రభుత్వ అభిమతం. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంటుతో వేతన సవరణ చేశాం. తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు మంచి జీతభత్యాలు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని స‌ర్కారు ఉద్యోగుల‌ను ఖుష్ చేసే వార్త తెలిపారు.