Begin typing your search above and press return to search.

గంట భేటీ..ప‌ది విన‌తిప‌త్రాలు..ఏం కోరారంటే

By:  Tupaki Desk   |   15 Jun 2018 10:47 AM GMT
గంట భేటీ..ప‌ది విన‌తిప‌త్రాలు..ఏం కోరారంటే
X
ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం ముగిసింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌త్యామ్నాయ వేదికను ప్ర‌స్తావించడ‌మే కాకుండా త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్టిన త‌ర్వాత మోడీ-కేసీఆర్‌ల మ‌ధ్య ఇదే మొద‌టి భేటీ. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు - కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. కొత్త జోనల్ వ్యవస్థ - రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని, రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు వంటి అంశాలపై ప్రధానికి కేసీఆర్ వినతిపత్రం ఇచ్చారు.

త‌న చిరకాల కోరిక అయిన కొత్త సెక్ర‌టేరియ‌ట్ విష‌యాన్ని ఈ భేటీలో కేసీఆర్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. వాస్తు కార‌ణంగా స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని కేసీఆర్ సిద్ధ‌మ‌వ‌డం అందుకు స్థ‌లం ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో ప‌ట్టువిడ‌వ‌ని రీతిలో ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తున్నారు. హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరామ‌ని పేర్కొంటూ ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేసీఆర్ త‌న విన‌తిప‌త్రంలో కోరారు. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు స్టేట్ హైవే విస్తరించడానికి అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని గుర్తుచేశారు. ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుందని త‌న‌దైన శైలిలో కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా మనవి చేస్తున్నామ‌ని త‌న లేఖ‌లో కేసీఆర్ కోరారు.

ఇక త‌న ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు అయిన కాళేశ్వ‌రం విష‌యంలోనూ కేసీఆర్ కీల‌క డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరిత గతిన అనుమతులు ఇచ్చినందుకు ధ‌న్యవాదాలు తెలుపుతున్నామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు రూ.25వేల కోట్లతో పాటు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.22 వేల కోట్ల రుణం కూడా పొందిన‌ప్ప‌టికీ ఇంకా నిధుల అవసరం ఉందని అంటుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించగలరని కోరుతున్నామ‌న్నారు. ఇదిలాఉండ‌గా..ఈ భేటీలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యమై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న‌ప్ప‌టికీ ఏయే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌నేది స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. ఈ భేటీ అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడ‌క‌పోవ‌డంతో మోడీ, కేసీఆర్‌ల మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది...గులాబీ ద‌ళ‌ప‌తి వెళ్ల‌డిస్తే కానీ స్ప‌ష్ట‌త‌కు రాదు.