Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌థ‌కాల‌న్నీ ఉత్త‌మాట‌లేనా?

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:20 AM GMT
కేసీఆర్ ప‌థ‌కాల‌న్నీ ఉత్త‌మాట‌లేనా?
X
'గుజరాత్‌ తర్వాత యావత్‌ భారత దేశంలో మన తెలంగాణాయే నెంబర్‌ వన్‌. ధనిక రాష్ట్ర జాబితాలో మనది రెండోస్థానం. ఏ పథకానికైనా, కార్యక్రమానికైనా నిధులకోసం వెనకాడొద్దు. ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాం. వాటిని పక్కాగా అమలు చేయండి'...వివిధ సమీక్షలు, సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులకు పదేపదే ఉద్బోదించే మాటలివి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ఆయన మాటలకు, వాస్తవానికి పొంతన లేదనేది తేటతెల్లమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం తన సొంత ఆదాయ వనరులన్నింటి ద్వారా నెలకు ఆర్జించేది కేవలం రూ.4 వేల కోట్లేనని లెక్కలు చెబుతున్నాయి. ఇది కాకుండా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం...కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన నిధులు, భూముల అమ్మకాల ద్వారా ఆర్జిస్తామనుకున్న మొత్తాల ద్వారా ఇంతవరకు అదనంగా ఒక్క పైసా రాలేదు.

రాష్ట్ర ఖజానాకు ప్రతినెలా వస్తున్న సొంత ఆదాయం రూ.4 వేల కోట్లలోంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల కోసం రూ.2,500 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకోసం రూ.650 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇదికాకుండా వివిధ బ్యాంకులు, ప్రయివేటు సంస్థల వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రూపంలో రూ.650 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవన్నీపోను సొంత ఆదాయంలోంచి నెలకు కేవలం రూ.50 కోట్లే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌ గ్రిడ్‌ - మిషన్‌ కాకతీయ - రెండు పడక గదుల ఇళ్లు - కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితరాంశాల అమలుకు నిధులెక్కడి నుంచి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కారుకు రావాల్సిన నిధుల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణాకు సైతం నిధులను విడుదల చేస్తారు తప్పితే మనపై ప్రత్యేక దృష్టేమీ ఉండబోదని అధికారులు వివ‌రిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే తెలంగాణాకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలంటూ ఆయన కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదు. రాష్ట్రానికి ఉన్న రూ.17 వేల కోట్ల రుణాలను రద్దు చేయాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. కేంద్ర అమ్మకపు పన్ను (సిఎస్‌ టి) నుంచి రాష్ట్ర సర్కారుకు ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మూడో వంతు నిధులను మాత్రమే ఇవ్వగల మంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గతంలో జరిగిన 'సాధికారిక కమిటీ సమావేశం'లో చెప్పారు. ఈ ప్రకారంగా చూసినా...తెలంగాణాకు రూ.2 వేల కోట్లు రావాలి. కానీ కేంద్రం ఇప్పటి వరకు కేవలం రూ.400 కోట్లే విడుదల చేసినట్టు తెలిసింది.

ఇదిలాఉంండ‌గా రూ.14 వేల కోట్ల రెవెన్యూ లోటుతో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ కు ఆర్థికసాయం చేస్తామంటూ ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో హామీనిచ్చింది. ఆ వాగ్దానాన్నే ఇప్పటి వరకూ పూర్తిగా నెరవేర్చలేదు. కేవలం రూ.2 వేల కోట్లే కేంద్రం ఇచ్చింది. ఏపీ ప‌రిస్థితే అలా ఉంటే తెలంగాణాకు భవిష్యత్తులోనైనా ఆర్థికసాయం చేస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు సొంత ఆదాయం పెరక్కపోవటం, మరోవైపు కేంద్రం నుంచి అదనపు ఆర్థికసాయం లేకపోవటం తదితర పరిణామాల నేపథ్యం లో...తెలంగాణ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు, కొత్త పథకాలు, కార్యక్రమాలను ఎలా అమలు చేస్తుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తంగా కేసీఆర్ హామీల‌కు, అమ‌లుకు మ‌ధ్య తీవ్ర వ్య‌త్యాసంతో ప‌థ‌కాల అమ‌లుపై సందిగ్దం నెలకొన్న‌ట్లేనని భావిస్తున్నారు.