Begin typing your search above and press return to search.

హిమాల‌యాలు..గోదావ‌రిని క‌లిపేద్దాం: కేసీఆర్

By:  Tupaki Desk   |   20 Feb 2018 7:02 AM GMT
హిమాల‌యాలు..గోదావ‌రిని క‌లిపేద్దాం: కేసీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల‌లు - ఆలోచ‌న‌లు - ఆచ‌ర‌ణ గురించి చెప్పాలంటే...మిగ‌తా వారు అస్స‌లు ఊహించ‌ని అంశాన్ని ఆయ‌న ప‌ట్టుకుంటారు. తోటివారు త‌ట‌ప‌టాయిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న వేగంగా ముందుకుసాగుతుంటారు. ఎంత వివాదం చెల‌రేగినా ఆయ‌న దారి అదే. అస‌లేమాత్రం న‌మ్మ‌శ‌క్యం కాని వాటిని కూడా త‌న ఆలోచ‌న‌ల ద్వారా ఆయ‌న ప్ర‌పంచానికి తెలియ‌జెప్తుంటారు. అలాంటి తాజా ఆలోచ‌నే...హిమాల‌యాల‌తో గోదావ‌రి అనుసంధానం.

ఔను. నిజ‌మే. న‌దుల అనుసంధానంలో భాగంగా హిమాలయాల నుండి మానస్‌ – సంకోష్‌- తీస్త-గంగా- సువర్నరేఖ-మహానది మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలన్న కొత్త ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. హైదరాబాద్‌ లో నేడు జరగనున్న దక్షిణాది జలవనరుల ప్రాంతీయ సదస్సులో ఈ కీలక ప్రతి పాదన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హిమాలయాల నుండి నదీప్రవాహాలను గోదావరికి మళ్ళించడమొక్కటే భవిష్యత్‌ తరాలకు నీటికొరతను తీర్చగలదని తెలంగాణ భావిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం 938టిఎంసిల నీటితో గోదావరిని లింక్‌ చేయడం వల్ల దక్షిణాది వాటర్‌ గ్రిడ్‌ పటిష్టం అవుతుందని.. ఈమేరకు సదస్సులో బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్నాటక - తమిళనాడు రాష్ట్రాలు.. ముఖ్యంగా కృష్ణాబేసిన్‌ లో భవిష్యత్తులో నీటికొరతకు ఈ ప్రతిపాదన వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు తెలం గాణకు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనపై ఎలా స్పంది స్తాయో చూడాల్సి ఉంది. కేంద్రజలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ నేతృత్వం లో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్‌ సదస్సుకు హైదరాబాద్‌ లోని బేగంపేట తాజ్‌ వివాంటా వేదిక కానుంది. తెలంగాణ - ఏపీ - తమిళనాడు - కేరళ - కర్ణాటక - పాండిచ్చేరి రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. మహాకావేరి అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై అధ్యయనానికి కేంద్రం సమావేశం ఏర్పాటుచేసింది.

ఇదిలాఉండ‌గా....కృష్ణా - గోదావరి నదులలో తెలంగాణ వాటా తేల్చవలిసిందేనని తెలంగాణ ప్రభుత్వం దక్షిణాది ప్రాంతీయ సదస్సులో గట్టిగా వాదించాలని నిర్ణయించింది. కృష్ణాలో ఆంధ్రప్రదేశ్‌ 512 - తెలంగాణ 299టిఎంసిలను వాడుకునేందుకు ఒక ఏడాది కోసం అరేంజ్‌ మెంట్‌ జరగ్గా - నాలుగేళ్ళయినా నీటి కేటాయింపులు తేలడం లేదు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కాకే కృష్ణా - గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో జలవనరుల మంత్రిత్వశాఖ సమావేశంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరిని ఉద్ఘాటించింది. ఒడిశాలోని మహానది నుండి తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ లోని గోదావరి - కృష్ణాలను కలుపుతూ తమిళనాడు - కర్ణాటకలోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది.గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం చూస్తోంది. అక్కడి నుండి 247 టిఎంసిలను నాగార్జునసాగర్‌ కు ఎత్తిపోసి - అక్కడి నుండి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరి తరలించాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇదివరకే కేంద్రం సమావేశం నిర్వహించగా తెలంగాణ ప్రభు త్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానది నుండి గోదావరికి మిగులుజలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించిన కేంద్రం మంగళవారం దక్షిణాది రాష్ట్రా లతో భేటీ ఏర్పాటుచేసింది.