Begin typing your search above and press return to search.

ఇదేనా..పొరుగు రాష్ట్రం మద్దతు..!!!!

By:  Tupaki Desk   |   21 July 2018 5:02 PM GMT
ఇదేనా..పొరుగు రాష్ట్రం మద్దతు..!!!!
X
రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు. అలాగే శాశ్వత మిత్రులు ఉండరు. ఈ పార్టీ వారు ఆ పార్టీలోకి - ఆ పార్టీ వారు ఈ పార్టీలోకి మారడం సమజమే. రెండు తెలుగు రాష్ట్రాలలోను గత కొన్ని 'సంవత్సరాలుగా ఇక్కడి వారు అక్కడికి - అక్కడి వారు ఇక్కడికి మారుతూండడం పరిపాటి అయ్యింది. అయితే తెలంగాణ ప్రజలు - ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మాత్రం మారలేదు రాజకీయ నాయకుల్లా ఏమారలేదు. ఈ విషయాన్ని గ్రహించని రాజకీయ పార్టీలు మాత్రం అక్కసు వెళ్లగక్కుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితీకి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు అయితే దీన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తున్నాయి.

లోక్‌ సభలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితీకి చెందిన లోక్‌ సభ సభ్యుల ప్రసంగాలు - ప్రవర్తించిన తీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనిపై తెలంగాణకు చెందిన ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. శుక్రవారం జరిగిన లోక్‌ సభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర సమితీకి చెందిన లోక్‌ సభ సభ్యుడు వినోద్ ప్రసంగించిన తీరుపై అటు ఆంధ్రప్రదేశ్‌ లోనూ - ఇటు తెలంగాణ లోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తమకు కొత్త స్నేహితుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొత్త స్నేహం ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన అస్థిత్వం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను సైతం బలి ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా తెరాస లోక్‌ సభ సభ్యుడు వినోద్ చేత కుట్రపూరితమైన ప్రసంగాలు చేయించారు. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. " మనం బాగుండాలంటే పొరుగున ఉన్న - ఇన్నాళ్లు కలసి ఉన్న ఆంధ్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలా " అని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే "పొరుగు వారు ప్రాణాల గురించి పోరాడుతుంటే మనకు తగిలిన దెబ్బలను గురించి మాట్లాడతమా" అని తెలంగాణ వాసులే ప్రశ్నిస్తున్నారు. ఇదేమి న్యాయమంటూ తెలంగాణ వాసులు సంధిస్తున్న ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్ర సమితీ ఏం సమాధానం చెబుతుంది.