Begin typing your search above and press return to search.

కేసీఆర్ నయా క్యాబినెట్..!?

By:  Tupaki Desk   |   16 Dec 2018 11:00 AM GMT
కేసీఆర్ నయా క్యాబినెట్..!?
X
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ముఖ్యమంత్రి గా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఆయన తో పాటు మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కాదు కాదు... ముఖ్యమంత్రి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం హోరెత్తింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చివరి నిమిషంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే కల్వకుంట్ల వారికి అత్యంత సన్నిహితుడైన మహమూద్ ఆలీ ని తనతో పాటు మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించడం.

అంతేనా అంటే కాదు... కాదు... ఏకంగా హోం మంత్రి గా బాధ్యతలు అప్పగించడం కూడా జరిగిపోయింది. అంతే కాదు... దీంతో పాటు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా... అంటే తన వారసుడిగా కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు ను కూడా నియమించారు. మామూలుగానే తన సంచలన నిర్ణయాలతో పార్టీలోని వారిని- ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈసారి మంత్రివర్గం కూర్పు పై కూడా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు.

ఈసారి కల్వకుంట్ల వారి క్యాబినెట్ లో పాత ముఖాలేవి ఉండవనే ప్రచారం జోరు గా జరుగుతోంది. తాను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే సమయం ఆసన్నమైందని భావిస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగానే క్యాబినెట్‌ను ఎంపిక చేయనున్నారంటున్నారు. ఈ క్యాబినెట్ లో అందరూ తన కుమారుడి వయసు వారో... లేదో అందుకు కొద్దిగా పెద్ద వారో ఉండేలా చూస్తున్నారని అంటున్నారు. " ఈ సారి తెలంగాణ లో యంగ్ టీం రాబోతోంది" అని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. తన తర్వాత కుమారుడు కె.తారక రామారావు ను ముఖ్యమంత్రి ని చేస్తే ఆయనకు సీనియర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా యువ ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పాత మంత్రులందరికీ దాదాపు ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయంటున్నారు. ఇక తన మేనల్లుడు హరీష్ రావు కు కూడా ఈ సారి మంత్రివర్గంలో స్ధానం దక్కక పోవచ్చునని అంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో బిజీ గా ఉండే తనకు అక్కడ అన్ని విధాలుగా తన పక్కన ఉండేందుకు హరీష్ రావు ను జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన గా చెబుతున్నారు. దీని వల్ల రెండు విధాలుగా ఉపయోగం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. మొదటిది తన కుమారుడి తారక రామారావు కు రాష్ట్రం లో అడ్డంకి గా లేకుండా చేయడం ఒకటైతే.... మరొకటి గ్రూపసులకు దూరం చేయడం అంటున్నారు. మొత్తానికి ఈ సారి కుమారుడి పట్టాభిషేకంతో పాటు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నట్లు చెబుతున్నారు.