Begin typing your search above and press return to search.

ఈ దఫా కిట్లతో కొట్టేయనున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   27 March 2017 5:25 AM GMT
ఈ దఫా కిట్లతో కొట్టేయనున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు మొత్తం మరోసారి అధికారాన్నిచేజిక్కించుకోవటానికి ఓటుబ్యాంకు దిశగా సాగుతుండటం గమనార్హం. కారణం ఏమైనా.. ఇంకా పట్టించుకోకుండా వదిలేసిన అంశాల్ని పట్టించుకోవటమే కాదు.. కొత్త తరహా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. త‌న‌ పథకాల్ని అమలు చేస్తున్న వైనం చూస్తున్నప్పుడు కేసీఆర్ దూరదృష్టికి ముగ్ధులు కావాల్సిందే.

ఇప్పటికే బాలింత మహిళలకు ఇస్తున్న కిట్లతో.. వారి మనసుల్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి ఫోకస్ భ‌విష్య‌త్ ఓట్లపై ప‌డింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజన తర్వాత గానీ హాస్ట‌ల్‌ విద్యార్థులను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ముఖ్యంగా ఇందులో భావి మ‌హిళా ఓటు బ్యాంకు దాగుంది.

హాస్టల్స్ లో ఉండే విద్యార్థినులకు.. కాస్మోటిక్స్ ఛార్జీల పేరిట నెలకు రూ.55 ఇస్తుంటారు. దళిత - గిరిజన - వెనుకబడిన, మైనార్టీ - వికలాంగ విద్యార్థినులకు వీటిని అందిస్తుంటారు. పేరులో కాస్మోటిక్స్ అన్న మాట వినిపించినా.. ఈ మొత్తాన్ని వారు వినియోగించేది అత్యవసర నిత్యావసరాలైన‌ కొబ్బరినూనె - ఒంటి సబ్బు - డిటర్జెంట్ సబ్బుల‌కు వినియోగించుకుంటుంటారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చే రూ.55 తో ఇవన్నీ రాని పరిస్థితి. దీంతో.. ఇంటి నుంచి ప్రతి నెలా ఎంతోకొంత మొత్తాన్ని తీసుకునే పరిస్థితి. అవకాశం ఉన్న వారు ఇంటి నుంచి వచ్చే డబ్బులతో సర్దుబాటు చేసుకుంటే.. చాలామంది ఒంటి సబ్బులు కొనలేని పరిస్థితుల్లో స్నానం చేసి వెళ్లిపోయే పరిస్థితి. ఇక శానిట‌రీ నాపికిన్స్ కొన‌లేక‌, అవి దొర‌క్క న‌ర‌కం చూస్తుంటారు. ఇవి వాడలేని కారణంగా అనారోగ్యానికి గురి అవుతుంటారు. చదువుకునే చిట్టి తల్లులకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినప్పుడు అయ్యో పాపం అని అనుకోకుండా ఉండలేం. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఈ ఇబ్బందికర పరిస్థితి మీద ఫోకస్ చేసింది లేదు. విద్యార్థినుల వెతల గురించి సమాచారం అందుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ లో ఉండే 4 లక్షల మంది విద్యార్థినుల వెతలు తీర్చేలా నిర్ణయం తీసుకున్నారు.

బాలింత‌ల‌కు ఇచ్చిన‌ట్లే వీరికి కిట్లు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. సబ్బులు - కొబ్బరినూనె - షాంపో - శానిటరీనాప్ కిన్స్ తో కూడిన ప్రత్యేకకిట్లను విద్యార్థినులకు ఇవ్వ‌నున్నారు. మరోవైపు.. తాజాగా ఇచ్చే కిట్లతో నేరుగా నాలుగు లక్షల కుటుంబాలు కేసీఆర్ కారణంగా లబ్ది పొందటం ఖాయం. తమ వెతల గురించి పట్టించుకున్న కేసీఆర్ ను అంత త్వరగా మర్చిపోరన్నది నిజం. ఈ ప‌థ‌కం వ‌ల్ల అయ్యే ఖ‌ర్చుతో పోలిస్తే వ‌చ్చే మైలేజీనే ఎక్కువ‌. ఈ కిట్ల పంపిణీ పక్కదారి పట్టకుండా ఉండటం కోసం ప్రసిద్ధ కంపెనీలతో టై అప్ పెట్టుకొని.. వారే ఈ కిట్లను తయారు చేసి పంపిణీ చేసేలా ప్రణాళికల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒక విద్యార్థినికి సాయం చేయ‌డం అంటే భ‌విష్య‌త్తులో ఆమె కుటుంబ ఓటు బ్యాంకు మొత్తం త‌న వాటాలో వేసుకోవ‌డ‌మే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/