Begin typing your search above and press return to search.

ఉత్కంఠ‌కు తెర‌..గుత్తాకు గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   25 Feb 2018 2:52 PM GMT
ఉత్కంఠ‌కు తెర‌..గుత్తాకు గుడ్ న్యూస్‌
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌ - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మాటంటే మాటే. మాట ఇచ్చానంటే త‌ల న‌రుక్కొని అయినా...అమ‌లు చేస్తాన‌ని త‌ర‌చుగా చెప్పే కేసీఆర్ హామీల‌పై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తుంటారు. అయితే క‌ట్టుబ‌డి ఉన్న సంద‌ర్భాలు అతి త‌క్కువ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తుంటాయి. ఈ విమ‌ర్శ‌లు - స‌మ‌ర్థ‌న‌ల సంగ‌తి ఎలా ఉన్నా..తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ఇచ్చిన లీకుల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఆయ‌న నిరూపించారు. జంపింగ్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి త‌న మాటంటే...మాటేన‌ని నిరూపించుకున్నారు కేసీఆర్‌.

తెలంగాణ‌లోని రైతుల సంక్షేమం కోసం రైతు స‌మ‌న్వ‌య స‌మితి పేరుతో సీఎం కేసీఆర్ కొత్త వేదికను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ్యవసాయాభివృద్ధి - రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పోరేషన్ పనిచేస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ లాగా కార్పోరేషన్ పనిచేస్తుంది. ఈ సంస్థకు సమకూరిన నిధులను సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారు. ఈ కార్పొరేష‌న్ ప‌నులు స‌క్ర‌మంగా న‌డిచేందుకు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట రాష్ట్రంలో కొత్త కార్పోరేషన్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. గ్రామ - మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా - రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ రాష్ట్రస్థాయికి కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియ‌మించారు.

హైద‌రాబాద్ రాజేంద్రనగర్‌ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సులో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమానికి హాజ‌రైన రైతు సమన్వయ సమితుల సభ్యులకు మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్ అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భాగానే గుత్తా నియామ‌కాన్ని వెల్ల‌డించారు. `గ‌త ప్రభుత్వాల తీరుతో రైతు పరిస్థితి ఘోరంగా మారింది. ఒకప్పుడు కరువు వస్తే ఆ ఏడాదిని గుర్తు పెట్టుకునే వాళ్లం. వాతావారణ సమతౌల్యం దెబ్బతినడం వల్లనే అతివృష్టి - అనావృష్టి. సమైక్య రాష్ట్రంలో నీళ్లివ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని అవస్థలు పడ్డమో వర్ణనాతీతం. రైతుల కోసం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నం. దశాబ్దాల తరబడి వేదనకు గురై.. ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టినం. వ్యవసాయానికి రైతే రాజు. గ్రామాల్లో రైతుల ఆవేదన నా చెవులారా విన్న. జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది. వ్యవసాయం వాణిజ్యం కాదు.. అదొక జీవన విధానం. రైతు సమన్వయ సభ్యుల బాధ్యత చాలా పెద్దది. గ్రామాల సమన్వయ సమితి ఆ గ్రామానికి కథా నాయకులు కావాలి. రైతు పండించే రాశి చుట్టే కుల వృత్తులు ఆధారపడి ఉంటాయి. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డిని నియమిస్తున్నం. అనుభవం కలిగిన ఆయన సేవలు రైతు సంఘానికి ఉపయోగపడతాయి` అని కేసీఆర్ వెల్ల‌డించారు.