Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు గిఫ్ట్ - మోతెలో అంతా ఏక‌గ్రీవం

By:  Tupaki Desk   |   21 Jan 2019 7:51 AM GMT
కేసీఆర్ కు గిఫ్ట్ - మోతెలో అంతా ఏక‌గ్రీవం
X
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండ‌లం మోతె గ్రామ‌మంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చాలా ఇష్టం. దాన్ని ఆయ‌న త‌న స్వ‌గ్రామంగా భావిస్తుంటారు. అందుకే అధికారంలోకి వ‌చ్చాక ఆ ఊరును ద‌త్త‌త తీసుకున్నారు. బాగా అభివృద్ధి చేశారు. అందుకు ప్ర‌తిఫ‌లంగా మోతె గ్రామ‌స్థులు ఇప్పుడు త‌మ ప్రియ‌త‌మ నాయ‌కుడు కేసీఆర్ కు మంచి గిఫ్ట్ ఇచ్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవానికి ఓటేశారు.

మోతెలో ఓట‌ర్ల సంఖ్య దాదాపు మూడు వేలు. ఇక్క‌డ స‌ర్పంచ్ గా తాజాగా బీమ‌గోని ర‌జిత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆమెతో పాటు ఉప స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ల‌ను కూడా గ్రామ‌స్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వి ఏక‌గ్రీవం కావ‌డంతో గ్రామానికి ప్ర‌భుత్వం నుంచి రూ.10 ల‌క్షల న‌జ‌రానా అంద‌నుంది. ఆ సొమ్మును గ్రామాభివృద్ధి కోసం ఖ‌ర్చు చేస్కుంటామ‌ని గ్రామ‌స్థులు చెబుతున్నారు. తామంతా కేసీఆర్ చూపించిన బాట‌లో న‌డ‌వాల‌నుకుంటున్నామ‌ని వారు తెలిపారు. అందుకే ఏకగ్రీవానికి మొగ్గుచూపామ‌ని, త‌ద్వారా కేసీఆర్ కు గిఫ్ట్ ఇచ్చిన‌ట్లు భావిస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి కేసీఆర్ కు మోతె గ్రామంతో అనుబంధం ఉంది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాలంటూ 2001లోనే ఈ ఊరు వాళ్లు తీర్మానం చేశారు. దీంతో కేసీఆర్ అక్కడ ప‌ర్య‌టించారు. గ్రామంలో ముడుపు క‌ట్టారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డాకే ముడుపు విప్పుతాన‌ని చెప్పారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌త్యేక‌ తెలంగాణ ఏర్ప‌డ్డాక కేసీఆర్ మోతె వెళ్లారు. పండితులు వేద‌మంత్రాలు ప‌ఠిస్తుండగా స్థానికి దేవాల‌యంలో ముడుపు విప్పారు. గ్రామాన్ని దత్త‌త తీసుకున్నారు.