Begin typing your search above and press return to search.

సంపన్న రాష్ట్రానికి అది అలవిమాలిన కోరికా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:30 PM GMT
సంపన్న రాష్ట్రానికి అది అలవిమాలిన కోరికా?
X
తెలంగాణ సంపన్న రాష్ట్రం. మిగులు రాష్ట్రం. డబ్బులు బోల్డన్ని ఉన్నాయి. విద్యుత్తు సరఫరాకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత అవసరమైతే ఏపీకి కూడా కరెంటు విక్రయిస్తామని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీకి ఒక్క నీటి చుక్కను కూడా వెళ్లకుండా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాటర్ గ్రిడ్ కు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజలు తాగునీరు ఇచ్చి 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని పావులు కదుపుతున్నారు. మరి, రైతులకు కేవలం రూ.8000 కోట్లు ఖర్చు చేయలేరా?

ఒకేసారి రుణ మాఫీకి ఇప్పటికే 8000 కోట్లు ఖర్చు చేసేశారు. వచ్చే ఏడాది మరొక్క నాలుగు నెలల్లో రానుంది. అప్పుడు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక మిగిలింది 4000 కోట్లు మాత్రమే. ఇప్పుడు రైతులను రుణ విముక్తులను చేస్తే అయ్యే ఖర్చు కేవలం 8000 కోట్లు. సంపన్న రాష్ట్రం ఆ మాత్రం ఖర్చు చేయలేదా? ఇదే ప్రశ్నలను విపక్షాలు సంధిస్తున్నాయి. లక్షా 20 వేల కోట్లను నీళ్లు ఇచ్చినా, లక్ష కోట్లతో విద్యుత్తు తెచ్చినా తెలంగాణలో అసలు ముందర అంటూ రైతు అనేవాడు ఉండాలికదా. రోజుకు పది మంది చొప్పున రైతులు చనిపోతూ ఉంటే వ్యవసాయం చేయడానికి ఇక ఎవరు ముందుకు వస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కదా అని ప్రశ్నిస్తున్నాయి.

నిజానికి, ఎనిమిది వేల కోట్లను చెల్లిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీఎం పరిధిని పెంచిన తర్వాత 2000 కోట్లు వస్తాయని అప్పుడు అమలు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం ఎప్పటికి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇక, కోర్టుల్లో ఉన్న కేసుల్లో గెలిస్తే 4000 కోట్లు వస్తాయట. వాటిని రైతులకే ఖర్చు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఎంత విలువైన మాట. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ కేసులు పూర్తి కావడానికి మరెన్ని దశాబ్దాలు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఇలాగే ఉన్నాయి. వెరసి, ఒకేసారి రుణ మాఫీ అనేది చేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సంపన్న రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇది.