Begin typing your search above and press return to search.

ఎటకారాలపై బాస్ సీరియస్ అయ్యారు

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:33 AM GMT
ఎటకారాలపై బాస్ సీరియస్ అయ్యారు
X
పొగడ్త ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.. ఎటకారం అంత మంట పుట్టిస్తుంది. తనలోనే భారీ ‘కారం’ నింపుకున్న ఎట‘కారాన్ని’ తట్టుకునే తత్వం రాజకీయ నాయకులకు తక్కువే. అందులోకి పవర్ ఉన్న అధినేతలకైతే ఇది మరింత కష్టం. తాజాగా కురిసిన అతి భారీ వర్షాపాతం దెబ్బకు హైదరాబాద్ మహా నగరం హాహాకారాలే చేసింది. ఒక్కసారిగా కుమ్మరించిన జడివానతో పాటు.. విడవకుండా కురుస్తున్న వాన దెబ్బతో రోడ్డు మొదలుకొని ఇళ్ల వరకూ ఎక్కడా.. ఎదీ వదిలిపెట్టనట్లుగా అన్నీ ఆగమాగమైపోయిన పరిస్థితి.

ఇలాంటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలెంత షాక్ కు గురి అవుతారో.. ప్రభుత్వ యంత్రాగం కూడా అంతే షాక్ కు గురి అవుతుంది. విపత్తు రోజూ వచ్చి పడేవి కాదు. దీంతో.. విపత్తు ఒక్కసారిగా మీద పడిన వెంటనే రియాక్ట్ కావటానికి ఇదేమీ సినిమా కాదు. అందుకే ప్రభుత్వం.. అధికారులు రియాక్ట్ అయి.. సహాయక సరంజామాను సర్దుకొని ప్రజల వద్దకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది ప్రాక్టికల్ గా ఉన్న ప్రాబ్లం. అయితే.. హైదరాబాద్ లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో.. ఒళ్లుమండిన సామాన్యులు తమ ధర్మాగ్రహాన్ని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే.. ‘‘విశ్వనగరాన్ని సృష్టిస్తాం. ప్రతి ఇంటిని నీళ్లను రప్పిస్తాం’’ అన్న మాటల్ని సమయానికి తగ్గట్లుగా అన్వయం చేసేసి.. ఎటకారంతో పోస్టులు పెట్టేయటం.. అవి కాస్తా వైరల్ గా మారి ప్రజలందరికి వెళ్లిపోతున్నాయి. పొగడ్తల కారణంగా వచ్చే మైలేజీని ఆనందంగా స్వీకరించే పాలకులు.. ఎటకారంతో కలిగే మంటను జీర్ణించుకోవటం కష్టం. సరిగ్గా కేసీఆర్ అండ్ కోకు ఇదే సమస్య ఎదురైంది.

మిగిలిన వారైతే రియాక్షన్ వేరుగా ఉండేది. కానీ.. కేసీఆర్ అలా కాదుగా. కడుపులోని కోపాన్ని ఆయన దాచుకోలేరు. అందులోనూ తనను ఎప్పుడూ.. ఎవరూ మాట అనేందుకు సాహసం చేయని తీరుకు భిన్నంగా సామాన్యులు తన మాటల్ని ఎటకారం చేయటం ఆయనను హర్ట్ చేసింది. పాలకుడికే హర్ట్ అయితే ఇంకేమైనా ఉందా? అందుకే ఆయన తాజాగా తన మాటలతో దుమ్ము దులిపేశారు.

తమ అవస్థల్ని ఎటకారాలతో సర్కారుపై సంధించిన వారిపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. ‘‘విశ్వనగరం ఇదేనా అంటూ కొందరు వెకిలిగా మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సభలోనే ఈ సమస్య వస్తుందని ముందే చెప్పా. ఈ విపత్తుపై మాకు సంపూర్ణ అవగాహన ఉంది. విశ్వనగరాలు రెండు మూడు రోజుల్లో పూర్తి అయ్యేవి కావు. అందుకు 10 – 12 ఏళ్లు పని చేయాలి. గత ప్రభుత్వాల దుర్మార్గ పాలకుల కారణంగా హైదరాబాద్ లో 28 వేల అక్రమ కట్టడాలు వెలిశాయి. ఎంత తెలివిగా వ్యవహరించారంటే.. నాలాలపై కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. ఈ నాలాల్ని మార్చేందుకు రూ.11వేల కోట్లు కావాలి. నగరంలో 90వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని రహదారుల్లో కేవలం పది శాతం మాత్రమే ధ్వంసమైంది. హైదరాబాద్ రోడ్ల మీదకు వస్తే చనిపోతారని భయాలు సృష్టిస్తున్నారు. రోడ్లు పాడైతే పాడయ్యాయని చెప్తాం. అమెరికాలో టోర్నడోలు వస్తే అక్కడి రోడ్లు మూడు నాలుగు రోజులు నీళ్లలోనే ఉంటాయి. అక్రమ కట్టడాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటే బల్దియాలో ఒక్కరు కూడా మిగలరు. ఇప్పటి నుంచి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తాం’’ అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.