Begin typing your search above and press return to search.

గులాబీ రంగుతో కేసీఆర్‌ కు మేలు చేస్తున్న ఈసీ!

By:  Tupaki Desk   |   23 Oct 2018 4:55 PM GMT
గులాబీ రంగుతో కేసీఆర్‌ కు మేలు చేస్తున్న ఈసీ!
X
తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా మహిళలను చైతన్య పరిచి - వారి ఓట్ల శాతం పెంచేందుకు గులాబీ రంగు (పింక్ బూత్ ) పోలింగ్ బూత్‌ లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కొత్త‌ వివాదం చెల‌రేగింది. ఈ చ‌ర్య టీఆర్ ఎస్‌ కు మేలు చేసేదేన‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు ఆ పార్టీ ముఖ్య అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ కొత్త వివాదాన్ని తెర‌మీద‌కు తెచ్చారు.

ఈ మేర‌కు ఈసీ నిర్ణ‌యంపై శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. `మహిళల ఓట్లు పెంచడం మంచి ప్రయత్నమే కాని ఆ ఉద్దేశ్యంతో టీఆర్ ఎస్ పార్టీ జెండాకు చెందిన రంగుతో (పింక్ బూత్) గులాబీ రంగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదని భాద్యత గల ప్రతి పక్ష పార్టీగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం`` అని ఓ ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఒక పార్టీకి లబ్ది చేకూర్చే కుట్ర పూరిత విధానానికి శ్రీకారం చుట్టిందని భావిస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భఃగా ఈసీ గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు. `ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నో పోరాటాల తర్వాత అమలులోకి వచ్చిన నోటాను సైతం గత జీహెచ్ ఎంసీ ఎన్నికల సందర్భంగా నోటా గుర్తుపై పింక్ కలర్ ఉందని టీఆర్ ఎస్ పార్టీ అభ్యంతర పెట్టడంతో - ఈవీఎంలో నోటా ఆప్షన్‌ నే తొలగించిన ఎన్నికల సంఘం - మరో మారు టీఆర్ ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో గులాబీ వర్ణంలోకి పోలింగ్ బూత్‌ లను మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయాలనుకోవడం - ఎన్నికల నియమావళిని కాలరాయడం` అని ఆయ‌న మండిప‌డ్డారు.

కాగా, ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన ఎన్నికల విష‌యంలో అలాంటి ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తే - ప్రజాస్వామ్య వాదులు ఎన్నికలంటేనే అసహ్యించుకునే ప్రమాదం ఉందని శ్ర‌వ‌ణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ద చర్యలను తక్షణమే నిలుపుదల చేసి - అభ్యంతరం లేని మరో రంగును పోలింగ్ బూత్ ల కోసం వాడాలని, తద్వారా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రజల తరఫున కోరుతున్నామ‌న్నారు.