Begin typing your search above and press return to search.

అవును...కేసీఆర్ కాపీ కొట్టారు!

By:  Tupaki Desk   |   17 Oct 2018 5:44 AM GMT
అవును...కేసీఆర్ కాపీ కొట్టారు!
X
తెలంగాణ‌లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఇప్ప‌టికే పోటాపోటీ మాట‌ల‌తో వాతావ‌ర‌ణం ఒక రేంజ్ కి చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల మేనిఫేస్టోకు సంబంధించి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్‌.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇటీవ‌ల కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కేసీఆర్ ఫాలో అయిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఇదే విష‌యాన్ని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెబుతూ.. తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

తాము ఏడాది నుంచి చెబుతున్న విష‌యాల్ని మ‌క్కికి మ‌క్కి కాపీ కొట్టి.. త‌మ మేనిఫెస్టోగా కేసీఆర్ చెప్పుకున్నార‌ని.. కేసీఆర్ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో తాజాగా వారు వెల్ల‌డించిన మేనిఫెస్టోను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ తీరును తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన ఉత్త‌మ్ ఏం చెప్పార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+ తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓటమిని, కాంగ్రెస్‌ విజయాన్ని సూచిస్తున్నాయి. నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవబోతోంది. గెలిచాక రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మేం అమలు చేసే విషయాలను గత ఏడాది నుంచి చెబుతున్నాం.

+ అర్ధంతరంగా అసెంబ్లీని రద్దు చేసుకుని, ముందస్తు ఎన్నికలకు పోయి, తప్పకుండా ఓడిపోతామని, కాంగ్రెస్‌ గెలుస్తుందని నిర్ధారించుకున్నాక కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న విషయాలను ఇప్పుడు కేసీఆర్‌ చెప్పారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యలు, ప్రకటనలు ఉంటాయా?

+ మేం నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామంటే తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లు హేళన చేశారు. రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో తమకు తెలియదని, తామే నిరుద్యోగులమవుతామని, ఎట్లిస్తరని, లెక్కలున్నాయా అని అడిగారని,

+ మళ్లీ ఇప్పుడు వాళ్లే సిగ్గులేకుండా నిరుద్యోగ భృతి ప్రకటించారు. కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఇస్తామని, తెలంగాణలో 12 - 13 లక్షల మంది నిరుద్యోగులున్నారని సర్వేలో తేలిందని అన్నారంటే.. ఉద్యోగ భర్తీ చేయలేకపోయామని ఒప్పుకున్నట్టే కదా?

+ కేసీఆర్‌ ప్రకటనలు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ మునిగిపోయే పడవ అని, కాంగ్రెస్‌ గెలిచినట్టేనని ఆయనే ఒప్పుకున్న‌ట్లుంది. తాము చెప్పినవన్నీ అమలు చేయాలంటే దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లు కలిపినా చేయలేరని కేటీఆర్ అన్నారు. మ‌రిప్పుడేం సమాధానం చెబుతారు?

+ సామాజిక పింఛన్ల విషయంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, నేత కార్మికులకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పింఛన్‌ పెంచుతామని, వికలాంగులకు నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తామని మేం చెప్పిన కొన్ని నెలలకు నిద్ర లేచి అదే ప్రకటనను ఇదిగో మా మేనిఫెస్టో అంటూ కేసీఆర్‌ ప్రకటించారు.

+ రైతులకు సాయం చేస్తానని కేసీఆర్ ఈ రోజు అంటున్నాడు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో 4,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని అమానవీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

+ ఏకకాల రుణమాఫీ చేయాలని, మూడు, నాలుగు సార్లు ఇవ్వడం అర్థరహితమని, రైతులకు సరైన రీతిలో లబ్ధి కలగదని అటు అసెంబ్లీలో, ఇటు బయట తాము లేవనెత్తితే రైతులకు వడ్డీ కూడా తానే చెల్లిస్తానని ఆ మాట కూడా తప్పాడీ పెద్ద‌మ‌నిషి.

+ ఓటమికి భయపడే రైతుల గురించి సుదీర్ఘంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, పింఛన్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీలన్నీ కాంగ్రెస్‌ చెప్పిన విషయాలే. ఇప్పటికయినా కనువిప్పు కలిగినందుకు సంతోషం.

+ నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులను మళ్లీ గెలిపిస్తే చేస్తానని ఎన్నికలకు 50 రోజుల ముందు కేసీఆర్ ఎందుకు చెబుతున్నారు? అధికారంలో ఉంది మీరు. మ‌రి.. ఇప్పుడు చేస్తామ‌ని చెప్పే ప‌నుల‌న్నీ మీరెందుకు చేయ‌లేదు?

+ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? పింఛన్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏకకాల రుణమాఫీ అంటున్నారు.. గతంలో మేం అడిగితే ఎందుకు చేయ‌లేదు? ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడగలుగుతాడా?

+ దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు మూడెకరాలు ఇస్తానని చెప్పి చేయనందుకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి. గిరిజనులకు మూడెకరాలు,..ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. గిరిజనులు.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి.

+ కేసీఆర్‌ లాంటి దగుల్బాజీ, ధోకా మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఆయన ఎస్సీ, ఎస్టీలను నిరంతరం మోసం చేశాడు. 64 లక్షల మంది దళితుల్లో మూడు వేల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చిన మోసగాడు.. అబద్ధాల కోరు కేసీఆర్ . పట్టాలిచ్చిన 3వేల కుటుంబాల‌కు నేటికీ పొజిషన్లు ఇవ్వలేదు.

+ 40లక్షల మంది గిరిజనుల్లో ఒక్కరికి కూడా మూడెకరాల భూమి ఇవ్వకపోగా, చాలా కాలంగా వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాడు. బీసీలకు రూ.20–25వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.7–8 వేల కోట్లను కూడా ఖర్చు చేయలేదు.

+ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత అత్యంత ఆవేదన, ఆవేశంతో ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్‌. ఉద్యోగులు, టీచర్లకు ఎందుకు పీఆర్సీ ఇవ్వలేదో బహిరంగ ప్రకటన చేసి క్షమాపణచెప్పాలి. ఐఆర్‌ ఎందుకివ్వలేదని, సీసీఎస్‌ రద్దు చేస్తానని స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదు?

+ నాలుగేళ్లలో ఒక్క సామాన్యుడిని కలవని దేశంలోని ఏకైక సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌కు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు సమానమే. కేసీఆర్‌ బెదిరింపులకు మేం భయపడం. ఆయన్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది.