Begin typing your search above and press return to search.

బాబు కంటే కేసీఆరే స్పీడే స్పీడ్

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:34 AM GMT
బాబు కంటే కేసీఆరే స్పీడే స్పీడ్
X
రేసులో ముందుండాలని అందరూ తపిస్తారు. కానీ.. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ కాస్త డిఫరెంట్. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఉండే పాలసీని ఆయన ఫాలో అవుతారు. తాను గుర్తించని అంశానికి సంబంధించి ఏదైనా లెక్క తన దృష్టికి ఆలస్యంగా వచ్చినా.. జెట్ స్పీడ్ తో దాన్ని కవర్ చేసే లక్షణం ఆయనలో కనిపిస్తుంది. ప్రత్యర్థిని దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోవటానికి ఇష్టపడరు.

తన నిర్ణయంతో ఏపీ ముఖ్యమంత్రికి దెబ్బ పడే అవకాశం ఉండటం.. ప్రధాని మోడీ దగ్గర మార్కులు పడే ఛాన్స్ ఉంటే కేసీఆర్ ఇంకేమాత్రం ఆలోచించరన్న విషయం తాజాగా మరోసారి స్పష్టమైందని చెప్పాలి. నిన్నటి వరకూ తెలంగాణ అసెంబ్లీని ఎప్పుడు నిర్వహించాలన్నఅంశంపై నిర్ణయం తీసుకోని కేసీఆర్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీని కొలువు తీరేలా డెసిషన్ తీసుకున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తుందనే చెప్పాలి.

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లును మెజార్టీ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ బిల్లుకు తమ ఆమోద ముద్రను వేశాయి. ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల చేత వీలైనంత త్వరగా ఆమోదముద్ర వేయించేలా కేంద్రం పావులు కదుపుతోంది. ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (సెప్టెంబర్) మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం కేసీఆర్ దృష్టికి వచ్చింది. ఏపీ కంటే ముందుగానే జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసి పంపటం ద్వారా మోడీ దగ్గర మార్కులు కొట్టేసే అవకాశం ఉండటంతో పాటు.. మోడీ మిత్రపక్షం కంటే ముందుగా తాము ఆమోదముద్ర వేసి పంపామన్న పేరు తెచ్చుకునే వీలుందన్న వాదనతో కేసీఆర్ తనదైన స్పీడును మరోసారి ప్రదర్శించారు.

ఏపీ అసెంబ్లీ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ జీఎస్టీ బిల్లు ఆమోదముద్ర వేయాలని డిసైడ్ చేసిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఏపీ కంటే వారం ముందుగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయటం.. అందులో జీఎస్టీ బిల్లు ఆమోదానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా చేయాలని భావిస్తోంది. ఇందుకోసమే కేవలం నాలుగురోజుల వ్యవధి ఉన్నా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని శుక్రవారం నిర్ణయించటం గమనార్హం. తాజా నిర్ణయంతో బాబు కంటే తాము స్పీడ్ గా ఉన్నామన్న భావన కలిగించటంతో పాటు.. మోడీ దగ్గర మార్కులు కొట్టేసేలా కేసీఆర్ ప్లాన్ చేశారన్న మాట వినిపిస్తోంది.