Begin typing your search above and press return to search.

ఏడాదిలో 50 రోజులకు కేసీఆర్ ఓకే

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:22 AM GMT
ఏడాదిలో 50 రోజులకు కేసీఆర్ ఓకే
X
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న వేళ.. టీఆర్ ఎస్ నేతలు తరచూ ఒక డిమాండ్ ను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చేవారు. అసెంబ్లీ పని దినాలు పెంచాలని.. వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరారు. ఉద్యమ సమయంలో తరచూ ప్రస్తావించిన ఈ అంశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్ల తర్వాత కూడా చర్చకు రావటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ పని దినాల్ని భారీగా పెంచాలని డిమాండ్ చేసిన టీఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా.. గతంలో తాను చెప్పిన మాటను అమలు చేయని పరిస్థితి.

పెద్ద పెద్ద హామీలు అమలు చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ.. గతంలో తాను పదే పదే తెరపైకి తెచ్చిన డిమాండ్ కు సైతం ఓకే చెప్పకపోవటం గమనార్హం. మంగళవారం అసెంబ్లీ సమావేశం ముగిశాక.. మధ్యాహ్నం వేళ శాసన వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. విపక్షాలకు చెందిన వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పని దినాల పెంపు మీద చర్చ వచ్చింది. పార్లమెంటును 100 రోజులు పని చేసేలా మోడీ నిర్ణయం తీసుకున్నారని.. అదే రీతిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలూ ఇదే రీతిలో నిర్వహించాలని విపక్షాలు కోరాయి.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహించటానికి తమకు అభ్యంతరం లేదని తేల్చి చెబుతూనే.. ఇకపై ఏడాదికి యాభై రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించుకునేలా ప్లాన్ చేద్దామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటం గమనార్హం. ఓపక్క ఎన్నిరోజులైనా ఓకే అంటూనే.. మరోవైపు 50 రోజులు కచ్ఛితంగా సభను నిర్వహిస్తామని చెప్పటం చూసినప్పుడు.. ముఖ్యమంత్రి మాటలకు చేతలకు మధ్యనున్న అంతరం ఇట్టే అర్థంకాక మానదు.

వచ్చే నెల 20న నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో ఏమేం చర్చించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. కరవుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపట్టగా మూడు రోజులు ఆ అంశానికి కేటాయిద్దామని కేసీఆర్ చెప్పగా.. మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం.. కొత్త జిల్లాల ఏర్పాటు తదితరఅంశాలపై చర్చ జరగాలని విపక్షాలు చెప్పగా అందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నా.. వచ్చే నెలలో భారీగా వర్షాలు పడటం ఖాయమన్న సమాచారం తన దగ్గర ఉన్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశంలో విపక్షంగా టీఆర్ ఎస్ నేతలు డిమాండ్ కు.. నేడు అధికారపక్షంగా అనుసరిస్తున్న విధానానికి మధ్యనున్న అంతరం ఇట్టే కనిపిస్తుందని చెప్పక తప్పదు.