Begin typing your search above and press return to search.

వివాదంలో ఇరుక్కున్న పాల్.. ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   25 March 2019 4:50 AM GMT
వివాదంలో ఇరుక్కున్న పాల్.. ఏం చేశారంటే?
X
ఏపీ ఎన్నిక‌ల‌పై ప్రముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల చేసిన ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. త‌ర‌చూ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసే ఆయ‌న‌.. ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా ఏపీలో తాను సీఎం కావాల‌నుకునే వ్య‌క్తులు ఇద్ద‌ర‌ని.. అందులో మొద‌టి చాయిస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని.. రెండో ఛాయిస్ కేఏ పాల్ గా పేర్కొన్నారు. ఎందుకంటే ప‌వ‌న్ సీఎం అయితే ప్ర‌తి రోజూ మొద‌టి పేజీలో అంద‌మైన ప‌వ‌న్ ముఖం చూసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అదే.. కేఏ పాల్ కానీ సీఎం అయితే.. ఏపీ ప్ర‌జ‌లకు వినోదానికి ఢోకా ఉండ‌ద‌ని.. ప్ర‌తి రోజూ వారు కేఏ పాల్ చేష్ట‌ల‌తో టెన్ష‌న్లు వ‌దిలిపోవ‌టం ఖాయంగా చెప్పారు.

దీనికి త‌గ్గ‌ట్లే.. కేఏ పాల్ త‌న‌దైన శైలిలో చేస్తున్న వ్యాఖ్య‌లు.. ప్ర‌ద‌ర్శిస్తున్న చేష్ట‌ల‌తో ఏపీ ఎన్నిక‌ల హాట్ హాట్ వాతావ‌రణాన్ని కాసింత కామెడీగా మార్చార‌ని చెప్పాలి. ఇప్పుడాయ‌న మాట‌లు.. చేష్ట‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. ఆట‌లో ఆర‌టిపండులా మార్చాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న చేసి ప‌ని ఒక‌టి ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌తి పార్టీ ప్ర‌చారంతో హోరెత్తించే వేళ‌.. కేఏ పాల్ మిగిలిన వారికి భిన్న‌మైన ప‌నిని చేప‌ట్టారు. ఈ మ‌ధ్య‌నే కారులో వెళుతూ గాల్లో బాక్సింగ్ చేసిన ఆయ‌న‌.. ఈసారి మ‌రో చిత్ర‌మైన ప‌నికి దిగారు.

అర్థ‌రాత్రి 3 గంట‌ల ప్రాంతంలో సోష‌ల్ మీడియాలో ఆన్ లైన్ లైవ్ చేప‌ట్టి ఎన్నిక‌ల నిబంధ‌న ఉల్లంఘించిన‌ట్లుగా చెబుతున్నారు. మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నంగా రోడ్ల మీద కంటే కూడా సోష‌ల్ మీడియాలోనూ.. ఆన్ లైన్లోనూ ఆయ‌న ప్ర‌చార హ‌డావుడి క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల సంఘం ప‌రిమితుల‌కు భిన్నంగా తెల్ల‌వారుజామున ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఎలా నిర్వ‌హిస్తార‌న్న ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

దీనికి కేఏ పాల్ ఇచ్చిన స‌మాధానం వింటే ఔరా అనాల్సిందే. ఇంత‌కీ ఆయ‌నేమంటారంటే.. ఆన్ లైన్ లో తాను చేప్ట‌టిన లైవ్ కార్య‌క్ర‌మం ఎన్ ఆర్ ఐల కోస‌మ‌ని.. వారితో ఉద‌యం వేళ‌లోనే తాను మాట్లాడాన‌ని.. మ‌న‌కిక్కడ‌ అర్థ‌రాత్రి అయినా.. వారికి ఉద‌యం క‌దా? ఆ లెక్క‌న వారితో తాను చేప‌ట్టిన ఆన్ లైన్ లైవ్ కార్య‌క్ర‌మం ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించిన‌ట్లు ఎందుక‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. పాల్ వేసిన ప్ర‌శ్న‌కు ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.