Begin typing your search above and press return to search.

హ‌రిబాబు బైబై..వీర్రాజు ఎంట్రీ..బాబుకు కొత్త త‌ల‌నొప్పి

By:  Tupaki Desk   |   17 April 2018 5:15 AM GMT
హ‌రిబాబు బైబై..వీర్రాజు ఎంట్రీ..బాబుకు కొత్త త‌ల‌నొప్పి
X
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాకు నిన్ననే పంపించారని స‌మాచారం. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్న వేళ హరిబాబు రాజీనామా హాట్ టాపిక్ అయ్యింది. తన రాజీనామాపై స్పందించిన హరిబాబు `వచ్చేది ఎన్నికల సంవత్సరం… పార్టీలో యువతను ప్రోత్సహించాలన్నది తన అభిమతం. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నాలుగేళ్ల పాటు పనిచేశా… కొత్త కమిటీ మరో మూడు - నాలుగు రోజుల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉంది` అని అన్నారు. ఇక ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్‌గా మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరును పరిశీలించిన అధిష్టానం… ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి విముకత చూపడంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఢిల్లీలోని బీజేపీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం దాదాపు ఖారారు అయిపోయింది. దీనిపై అధికారికంగా కేంద్ర బీజేపీ నాయకత్వం ఓ ప్రకటన చేయనుంది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇప్పటికే అధిష్టానం లీకులు ఇచ్చింది. దీని వెనుక కూడా త‌గిన క‌స‌ర‌త్తు జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన వారి మాట ప్ర‌కారం రాష్ట్ర బీజేపీ ముఖ్య‌నాయ‌కుల్లో రెండుగా చీలిక ఉందని అంటున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు - మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి - మాజీ మంత్రి మాణిక్యాల‌రావు వంటివారు వ్యతిరేక వ‌ర్గ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఈ నేత‌లు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు. ఈ కోణంలో ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కు ఆఫర్ ఇచ్చిన అధిష్టానం - మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

సోము వీర్రాజు మొదటి నుంచి టీడీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..టీడీపీ నాయకులపై దూకుడుగా ఉండటం, పార్టీలో అందరి నాయకులతో కలిసి పోవడం వంటి వాటితో సంతృప్తి చెందిన బీజేపీ అధిష్టానం ఆయనకు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇవ్వనున్నారని స‌మాచారం. టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారిలో వీర్రాజు ముందువరసలో నిలుస్తారు. గ‌తంలోనే వీర్రాజు పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ....ఆయ‌న్ను అధ్యక్షుడుగా నియమిస్తే మిత్రపక్షమైన టీడీపీ ఎలా స్పందిస్తుందోనన్న సందేహం నెల‌కొంది. అయితే ఎన్డీఏకు టీడీపీ గుడ్‌ బై చెప్పేయ‌డంతో పాటుగా ఇటీవ‌ల ఎదురుదాడి చేస్తున్న నేప‌థ్యంలో అందుకు త‌గిన నాయ‌కుడిని అధ్య‌క్షుడిని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో టీడీపీని వ్యతిరేకించడంతో పాటుగా దూకుడుగా స్పందించే వీర్రాజుకు అవకాశం ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నిర్ణ‌యం వెనుక బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు. కాగా, ఏపీలో పార్టీని బలోపేతం చేయ‌డంపై దృష్టిపెట్టిన బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఈ క్ర‌మంలో నెలాఖరుకల్లా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన‌ట్లు స‌మాచారం.