Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాప‌లా కుక్క పాత్ర మారిపోయింది

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:10 AM GMT
కేసీఆర్ కాప‌లా కుక్క పాత్ర మారిపోయింది
X
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న టీఆర్ ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యమకారులను కాటేస్తున్నారని, కాపలా కుక్కే కాటేస్తే ఎలా అని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలపై జేఏసీ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిరసన ర్యాలీ నిర్వహించడానికి ఒకరోజు ముందే తలుపులు పగులగొట్టి జేఏసీ కన్వీనర్ కోదండరాంను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కోదండరాం స‌హా ఉద్య‌మ‌కారుల‌ను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

తెలంగాణలో కేసీఆర్ పాలన పోలీసు రాజ్యాన్ని తలపిస్తోందని జూల‌కంటి రంగారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అందరి హక్కు అని, నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చి కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీచేశారని ఆయన అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, యువత సహకారంతోనే ఉద్యమం సాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి నిరుద్యోగులు కన్నెర్ర చేస్తే కేసీఆర్ పతనం ఖాయమని ఆయన అన్నారు. రెండున్నరేండ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని జూల‌కంటి రంగారెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని ఆయన చెప్పారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయల్సి ఉండగా, కేసీఆర్‌ కొత్తచట్టాలను తెచ్చి, రైతులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి, కేసీఆర్‌ విస్మరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల కోసం 22లక్షల ఎకరాల భూములు పంచుతామన్న కేసీఆర్‌ కేవలం 7వేల ఎకరాలు కూడా పంచలేదన్నారు. నేటికి అనేక గ్రామాల్లో దళితులపై వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/