Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల శత్రువు

By:  Tupaki Desk   |   21 April 2018 8:20 AM GMT
ప‌వ‌న్ ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల శత్రువు
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఆయ‌న చేసేన వ్యాఖ్య‌లు - అభిమానులు చేసిన ప‌నికి జ‌ర్న‌లిస్టులు రోడ్డెక్కారు. ఒక రాష్ట్రం అని కాకుండా రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ నిర‌స‌న‌ల గ‌ళం వినిపించారు. త‌న కుటుంబ సభ్యులపై విమ‌ర్శ‌లు రావ‌డం - దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌ లోని ఫిలించాంబ‌ర్ వద్ద నిర‌స‌న తెలుప‌డం తెలిసిన సంగ‌తే. పవన్‌కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి చేసిన దూషణలను మీడియాలో పదే పదే ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు కొంత మంది ఫిలిం ఛాంబర్‌ లో జరుగుతున్న కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వచ్చిన టీవీ9 - ఏబీఎన్‌ ఛానల్‌ కు చెందిన ఓబి వ్యాన్‌ లపై రాళ్ళతో దాడి చేయగా రెండు ఓబి వ్యాన్‌ లు ధ్వంసమయ్యాయి. పరిస్థితి మరింత చేయి దాటుతుందన్న ఉద్దేశ్యంతో పోలీసులు ఫిలిం ఛాంబర్‌ లో ఉన్న పవన్‌ తదితరులను కలిసి పరిస్థితిని వివరించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని - లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో పవన్‌తో పాటు మిగతా వారంతా ఫిలిం ఛాంబర్‌ కార్యాలయం నుంచి జనసేన కార్యాలయానికి వెళ్ళిపోయారు.

మ‌రోవైపు టీవీ5 - టీవీ9 - ఏబీఎన్‌ టీవీ ఛానళ్ళ తీరుపై పవన్‌ విమర్శలు గుప్పించారు. ఆయా ఛానెళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఛానెల్‌ ఒక్కొక్క మాఫియాగామారి మానసిక అశాంతిని కలిగిసున్నాయని ఆయనొక ప్రకటనలో పేర్కొన్నా రు.తనపై పరువునష్టం దావా వేసేందుకు టీవీ9 శ్రీనిరాజు నేటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని - కానీ మీరంతా నిగ్రహంతో సంయమనం పాటించాలని పవన్‌ తన అభిమానులకు సూచించారు. ఆయా ఛానెళ్ల అధినేతలతో తాను సుదీర్ఘమైన - శక్తివంతమైన పోరాటానికి సిద్ధపడుతున్నానని, మీరంతా వివాదాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు.

అయితే మీడియా పై దాడులకు వ్యతిరేకంగా రెండు రాష్ర్టాల్లోనూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. హైద‌రాబాద్‌ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఖైరతాబాద్ కూడలి వరకు ర్యాలీ - మానవ హారం చేప‌ట్టారు. మీడియాపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా వారు డిమాండ్ చేశారు. మీడియాకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని - మీడియా వాహనాలపై దాడి చేసిన వారిని పవన్ కల్యాణ్ స్వచ్చందంగా పోలీసులకు అప్పగించాలని కోరారు. ఎడిటర్లు - మీడియా యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామ‌ని - పవన్ కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని విజ్ఞప్తి చేస్తామ‌ని విలేక‌రులు వివ‌రించారు. పవన్ దిగిరాకపోతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా విలేక‌రులు తెలిపారు. మ‌రోవైపు ఫిల్మ్ ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై పవన్ అభిమానుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలంగాణ జ‌ర్న‌లిస్ట్స్ యూనియ‌న్ నేత‌లు స్ప‌ష్టం చేశారు. దాడులతో మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేయొచ్చని వేయొచ్చని భావిస్తున్నాడేమో ఇది కరెక్ట్ కాదని టీయూడబ్ల్యూజే హెచ్చరిస్తోంది. మీడియా పట్ల మిత్ర ధోరణితో కాకుండా ఇలా ప్రవర్తిస్తే జర్నలిస్టుల చూస్తూ ఊరుకోరనే విషయాన్ని పవన్ గుర్తించాలని అల్లం వారు కోరారు.

మ‌రోవైపు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో విజ‌య‌వాడ‌లో ధర్నా నిర్వ‌హించారు. మీడియాపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఫిల్మ్ చాంబర్ వద్ద మీడియాపై దాడికి పాల్పడటం , మీడియాను నియంత్రించాలనే ప్రయత్నం చేస్తున్న నేప‌థ్యంలో నిరసన దీనికి జర్నలిస్ట్ సంఘాలు పిలుపు మేరకు నిరసన చేప‌ట్టామ‌ని వివ‌రించారు.