Begin typing your search above and press return to search.

మోడీ వేస్ట్ అంటున్న విదేశీ ఇన్వెస్టర్లు

By:  Tupaki Desk   |   5 Sep 2015 10:17 AM GMT
మోడీ వేస్ట్ అంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
X
''నరేంద్ర ​​మోడీ ఏదో చేస్తారనుకున్నాం... ఎంతో ఆశించాం.. సంస్కరణలు తెస్తారనుకున్నాం.. ఏడాదిన్నరగా ఎదురుచూపులే మిగిలాయి.. ఇంతవరకు ఎలాంటి సంస్కరణలు లేవు... ఒట్టి పబ్లిసిటీ తప్ప చేసిందేమీ లేదు... ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు"

- ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమోడిటీస్ ట్రేడింగ్ గురు, హెడ్జ్ అండ్ ఫండ్ మేనేజర్ జిమ్ రోజర్స్ అన్న మాటలివి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ రోజర్స్ మోడీ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రోజర్సే కాదు ప్రపంచ స్టాక్ మార్కెట్లను వడపోసిన దిగ్గజాలు చాలామంది ఇండియాలో పరిస్థితులపై తమకు భ్రమలు తొలగిపోయాయన్న సంకేతాలు పంపిస్తున్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్లో అమ్మకాలే ఉదాహరణ. నిఫ్టీ 8500 పైస్థాయి నుంచి 7500కి పడిపోయింది.. ఇలా వెయ్యి పాయింట్లు క్షీణించడమంటే మాటలు కాదు.. విదేశీ మదుపుదారులు షేర్లను అమ్మిపడేస్తున్నారు. సాధారణంగా నిఫ్టీ పడిపోతున్నప్పుడు మార్కెట్ క్షీణిస్తున్నప్పుడు కొనుగోళ్లు పెరిగి మళ్లీ మార్కెట్ నిలబడుతుంది. కానీ, విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం తమ అమ్మకాలను ఆపడం లేదు. గురువారం నిఫ్టీ ఒక శాతం పెరిగినప్పటికీ శుక్రవారం రూ.1200 కోట్లకు పైగా షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేశారు. ఒక్క ఆగస్టు నెలలోనే విదేశీ ఇన్వెస్టరు రూ.17 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారంటే పరిస్థితి అర్థః చేసుకోవచ్చు.

మరి విదేశీ మదుపర్లు ఎందుకు వెళ్లిపోతున్నారంటే దానికి రోజర్స్ వ్యాఖ్యలే సమాధానం. మోడీ పబ్లిసిటీ కోరుకోవడం తప్ప ఏమీ చేయడం లేదన్న ఆయన ఇక్కడి పరిస్థితులపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ''ఏడాదిన్నరగా చూశాం.. ఏమీ లాభం లేదని తెలిశాక నా దగ్గరున్న అన్ని భారత షేర్లను అమ్మేసి వెళ్లిపోతున్నాను. మోడీ సంస్కరణలు తేలేకపోయారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫైనాన్స్ గవర్నర్లతో ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ ఒకరు..... ఆయన కృషి వల్లే భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా నిలబడి ఉంది.. మార్పు తేవాల్సింది ప్రభుత్వాలే... వారేమీ చేయకపోతే ఆర్బీఐ గవర్నరు మాత్రం ఏం చేస్తారు.. మోడీ సంస్కరణలు తెస్తే అప్పుడు పెట్టుబడుల గురించి ఆలోచిస్తాను"" అని కుండబద్దలు కొట్టేశారు.

రోజర్స్ లాగే విదేశీ మదుపుదారులు ఆలోచిస్తున్నారనడానికి షేర్ల విక్రయాలే ఉదాహరణ. మొత్తానికి ఇండియాలో మోడీపై ఎలాంటి అంచనాలో ఉన్నాయో కానీ విదేశాల్లో మాత్రం ఆయన ప్రభ క్రమేణా క్షీణిస్తుందన్నది మాత్ర స్పష్టమవుతోంది.