Begin typing your search above and press return to search.

జీవ‌న్ రెడ్డి నోట‌... ఎమ‌ర్జెన్సీ మాట‌!

By:  Tupaki Desk   |   27 Jun 2017 12:58 PM GMT
జీవ‌న్ రెడ్డి నోట‌... ఎమ‌ర్జెన్సీ మాట‌!
X
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేత టి. జీవ‌న్ రెడ్డి... టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పాల‌న‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వంపై స్ప‌ష్ట‌మైన ఆధారాల‌తో ఆరోప‌ణ‌లు గుప్పించే జీవ‌న్ రెడ్డి... ఈ ద‌ఫా కుకునూరుప‌ల్లి ఎస్సై ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆత్మ‌హ‌త్య ఉదంతాన్ని ఆస‌రా చేసుకుని కేసీఆర్ స‌ర్కారు పాల‌న‌పై తీవ్ర స్థాయిలో ధ్వజ‌మెత్తారు. కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో మీడియాతో మాట్లాడిన జీవ‌న్ రెడ్డి... తెలంగాణ‌లో కొన‌సాగుతున్న పాల‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌న‌మంతా 1976 దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమ‌ర్జెన్సీ పాల‌న గురించి మాట్లాడుతుంటే... జీవ‌న్ రెడ్డి తెలంగాణ‌లో సాగుతున్న పాల‌న కూడా ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోందని త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. అధికార పార్టీ నాయకుల వైఖరితో ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డి తర్వాత అతని సంబంధీకులు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారిని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమర్జన్సీ కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణలో ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో గజ్వేల్ నియోజకవర్గం చూస్తే ఇట్టే అర్థమవుతుందని ఆయ‌న పేర్కొన్నారు.

కుకునూర్ పల్లి ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మృతులఫై జ్యుడీషియల్ విచారణ జరిపించి, సీఎం చిత్త శుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. శిరీష మరణానికి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యతో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించకుంటే టీఆర్ ఎస్ - బీజేపీ చేతులు కలిపినట్లే భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే ఉన్నాయని, కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/