Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను కాపీ కొట్టిన జ‌య‌లలిత‌

By:  Tupaki Desk   |   31 Aug 2016 2:10 PM GMT
కేసీఆర్‌ ను కాపీ కొట్టిన జ‌య‌లలిత‌
X
ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న తాటికొండ రాజ‌య్య‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ఠాత్తుగా తొల‌త‌గించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అంత స‌డ‌న్‌ గా జ‌రిగిపోయిన ఈ ప‌రిణామం అపుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇపుడు సేమ్ టు సేమ్ థిమ‌రీని త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలిత ఫాలో అయ్యారు. రాత్రికి రాత్రి అనూహ్య నిర్ణయాలు తీసుకుని సంచలనం సృష్టించారు. త‌మిళ‌నాడు పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి ఎస్పీ షణ్ముగనాథన్‌ ను తొలగిస్తూ జ‌య‌ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొంతమంది మంత్రుల శాఖల్లోనూ కొన్ని మార్పులు చేశారు. జయలలిత నిర్ణయం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.

పాత మంత్రిని తొల‌గించిన జ‌య‌లలిత కొత్తగా ఆవడి శాసన సభ్యుడు పాండియరాజన్‌ కు మంత్రిగా అవకాశం కల్పించారు. ఆయన్ను పాఠశాల విద్య - క్రీడలు - యువజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. మరో ఇద్దరు మంత్రుల శాఖలను కూడా ఆమె మార్చారు. పాఠశాల విద్య శాఖను ఇప్పటి వరకూ నిర్వహిస్తూ వచ్చిన మంత్రి పి.బెంజిమన్‌ కు గ్రామీణ - కుటీర - చిన్న పరిశ్రమల శాఖ కేటాయించారు. ఈ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీ రాజేంద్రబాలాజీకి పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ కేటాయించారు. శాఖలు మారిన మంత్రులు - పాండియరాజన్‌ లు సాయంత్రం రాజ్‌ భవన్‌ లో 4.35 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ మేరకు రాజ్‌ భవన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే మంత్రులను అనూహ్యంగా మార్చడం జయలలితకు మామూలే అన్న సంగ‌తి తెలిసిందే. గతంలో కూడా ఆమె పలు మార్లు ఇలా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అది గత శాసనసభ ఎన్నికల్లో ప్రచారాంశం కూడా అయింది. పనితీరు సరిగ్గా లేనివారు, విధేయత చూపని వారిని ఆమె ఏమాత్రం ఉపేక్షించరు. శాసనసభ ఎన్నికల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మార్పుచేర్పులు జరగలేదు.దీంతో జ‌య‌ల‌లిత దూకుడు త‌గ్గించుకొని ఉంటార‌ని అంతా భావించారు. అయితే ఇటీవల మంత్రుల పనితీరుపై జ‌య‌ల‌లిత ఒక నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. దాని ఆధారంగా వేటు వేయడానికి సిద్ధ ప‌డ్డ‌ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి వేటు షణ్ముగనాథన్‌ పై పడింది. ఆయన పనితీరుపై ముఖ్యమంత్రి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన శాఖను మంత్రివర్గంలో జయలలితకు విశ్వాసపాత్రుడిగా ఉన్న రాజేంద్రబాలాజీకి అప్పగించారు. త్వరలోనే మరికొంతమంది మంత్రులపైనా వేటు పడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.