Begin typing your search above and press return to search.

విశ్వాసపాత్రుడ్ని అమ్మ మర్చిపోలేదు

By:  Tupaki Desk   |   24 May 2016 4:42 AM GMT
విశ్వాసపాత్రుడ్ని అమ్మ మర్చిపోలేదు
X
అమ్మ విధేయుడి మీద వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ సీనియర్లు.. తనను నమ్ముకొని.. తన పట్ల అంతులేని విధేయతను ప్రదర్శించే వారి విషయంలో అమ్మ సానుకూలంగా స్పందించిన వైనం.. ఆమె క్యాబినెట్ ను చూస్తే అర్థమవుతుంది. కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉండాల్సిన సమయంలో తన స్థానంలో నియమించిన పన్నీరు సెల్వంను పక్కన పెట్టినట్లుగా.. ఆయనపై అపనమ్మకం పెరిగినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్న విషయాన్ని జయలలిత తన చేతలతో తేల్చేశారు.

ఒకసారి సీఎంగా పదవీకాలాన్ని పూర్తి చేసి..వెనువెంటనే మరోమారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అరుదైన రికార్డును 30 ఏళ్ల తర్వత బ్రేక్ చేసిన జయలలిత తాజాగా తన మంత్రివర్గంలో విధేయులకు పెద్ద పీట వేశారు. తనకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వంకు కీలకమైన మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. తమిళనాడు రాష్ట్ర డబ్బు లెక్కను ఆయన చేతికి అప్పజెప్పారు. ఎన్నికల వేళ.. పన్నీరు సెల్వం తీరుపై అమ్మకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని.. ఆయనను పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. తనపై ఆమ్మ ఆగ్రహం వ్యక్తం చేయటం.. తనకు బాధ్యతలు అప్పజెప్పకుండా వ్యవహరించిన తీరుపై పన్నీరు సెల్వం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన తీరుగా కథలు కథలుగా చెప్పుకున్నారు.

అయితే.. అలా వచ్చిన వార్తల్లో నిజం లేదని.. తనకు విశ్వాసపాత్రుడి విషయంలో తనకెంత భరోసా ఉందన్న విషయాన్ని జయలలిత కట్టబెట్టిన కీలక బాధ్యత చెప్పకనే చెబుతుందని చెప్పొచ్చు. ఆర్థికశాఖతో పాటు పాలనా సంస్కరణల బాధ్యతను జయలలిత ఆయనకు కట్టబెట్టారు. రాష్ట్ర సర్కారుకు గుండెకాయ లాంటి ఆర్థికశాఖను పన్నీర్ సెల్వంకు ఇవ్వటం ద్వారా ఆయనపై తనకున్న నమ్మకాన్ని అమ్మ మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి.