Begin typing your search above and press return to search.

ఏపీలో జ‌న‌సేన ఆఫీసు ఎక్క‌డో తెలిసింది

By:  Tupaki Desk   |   23 Nov 2017 12:18 PM GMT
ఏపీలో జ‌న‌సేన ఆఫీసు ఎక్క‌డో తెలిసింది
X

జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ కార్యక‌లాపాల‌ను జెట్ స్పీడ్‌ తో ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సైనికుల ఎంపిక‌ - పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వర్గాల వారీగా బాధ్యుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను వేగంగా చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా హైద‌రాబాద్‌ లోని కార్యాల‌యంలో ఐటీ సెల్ ఏర్పాటును ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీలో జ‌న‌సేన ఆఫీసు ఏర్పాటుకు స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యింది.

గుంటూరు జిల్లా చిన‌కాకాని వ‌ద్ద జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించేందుకు ఆ పార్టీ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఓ రైతువ‌ద్ద మూడున్న‌ర ఎక‌రాల భూమిని తీసుకున్న‌ట్లు స‌మాచారం. లీజుకు తీసుకున్న ఈ భూమిలో త్వ‌ర‌లో నిర్మాణ ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు పార్టీ వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్న‌ట్లు జ‌న‌సేనాధిప‌తి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను సైతం వేగ‌వంతం చేశారు. ఎన్నిక‌ల బ‌రిలో దిగే స‌మ‌యానికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే క్ర‌మంలో పార్టీ కార్య‌క‌ర్త‌లను స‌న్న‌ద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సైతం సంద‌ర్భానుసారం జ‌న‌సేనాని స్పందిస్తూనే ఉన్నారు.