Begin typing your search above and press return to search.

నాలుగేళ్లు దోచారు... ఎన్నికల్లో పంచారు...

By:  Tupaki Desk   |   16 Dec 2018 9:51 AM GMT
నాలుగేళ్లు దోచారు... ఎన్నికల్లో పంచారు...
X
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. విజయులు ఎవరో... పరాజయులు ఎవరో తేలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటు కూడా జరుగుతోంది. ఇక ఇప్పుడు మిగిలింది ఎలా గెలిచారు... ఏం చేసి గెలిచారు..... ఎంత ఖర్చు పెట్టారు... ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఖర్చు పెట్టారు అనేదే. దీనికి ఒక్కో పార్టీ ఒక్కో లెక్క చెబుతోంది. ఒక్కో ఒక్కో లెక్క చెబుతున్నారు. ప్రతి వారికి వారి వారి లెక్కలున్నాయి.... అయితే తెలియందల్లా వారి వారి తిక్కలే. సరే - విషయానికి వస్తే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 1500 నుంచి 2000 వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి నోముల నర్శింహయ్య చేతిలో ఓడిపోయారు. ఫలితాలు వెలువడి ఐదు రోజులు గడుస్తున్నా బయటకు రాని జానారెడ్డి నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గడచిన నాలుగేళ్లు కార్పొరేట్ సంస్ధలా వ్యవహిరించిందని అన్నారు.

" నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో టీఆర్ ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారు. వాటిలో 1500 కోట్ల రూపాయల నుంచి 2000 వేల రూపాయల వరకూ ఈ ఎన్నికల్లో ఖర్చు చేశారు" అని జానారెడ్డి విమర్శించారు. తాము దోచుకున్న డబ్బును తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ ఖర్చు చేశారని - ఇంత డబ్బు తెలంగాణరాష్ట్ర సమితికి ఎలా వచ్చిందో ప్రజలు గమనించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ధాన్యానికి మద్దతు ధరను 1500 ప్రకటించిందన్నారు. అలాగే గిరిజనులకు అటమీ హక్కుల చట్టం ద్వారా 10 లక్షల ఎకరాలు పంచిపెట్టామని వివరించారు. ఇక తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై కూడా జానారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏదో పదవి ఇస్తారని అంటున్నారని, నిజానికి కేసీఆర్ కు పదవి ఇచ్చింది తానేనని జానారెడ్డి చెప్పుకున్నారు. "నేను కేసీఆర్ దగ్గర పుచ్చుకునే మనిషిని కాదు. ఈ విషయం యువకులు - కార్యకర్తలు తెలుసుకోవాలి" అని జానారెడ్డి అన్నారు. ఇక ముందు తాను రాజకీయాలలో పెద్దగా తిరగనని - వయసు మీద పడుతున్న రీత్యా విశ్రాంతి తీసుకుంటానని, అంతే తప్ప పనికిమాలిన పదవులు తీసుకోనని జానారెడ్డి స్పష్టం చేశారు.