Begin typing your search above and press return to search.

గాంధీభ‌వ‌న్ వ‌ద్ద కాంగ్రెస్ దీక్ష‌..అసెంబ్లీలో డంకెన్ డ్రైవ్‌

By:  Tupaki Desk   |   13 March 2018 5:42 PM GMT
గాంధీభ‌వ‌న్ వ‌ద్ద కాంగ్రెస్ దీక్ష‌..అసెంబ్లీలో డంకెన్ డ్రైవ్‌
X
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌ వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి - సంపత్‌ ఎమ్మెల్యే ప‌ద‌విపై అన‌ర్హత వేటు వేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేప‌ట్టింది. గాంధీభ‌వ‌న్ వ‌ద్ద ఎమ్మెల్యేలు 48 గంట‌ల దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు మాట్లాడుతూ కేసీఆర్‌ పై దుమ్మెత్తిపోశారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింద‌ని అయితే వాటిని అమ‌లు చేయ‌డం లేద‌ని ఆరోపించింది. ప్రజా సమస్యలు అసెంబ్లీలో నిలదీస్తే అప్రజాస్వామికంగా పాలనా సాగిస్తోందని మండిప‌డ్డారు. బయట, అసెంబ్లీ లో కూడా కాంగ్రెస్‌ ను అణ‌గదొక్కుతోందని ఆరోపించారు. ఇద్దరు సభ్యులను బహిష్కరించడం అప్రజాస్వామికమ‌ని విమ‌ర్శించారు. అధికారంలో ఉన్న లేకున్నా కాంగ్రెస్ ప్రజల ప‌క్షాన ఉంటుందన్నారు.

ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సీఎం కావడంతోనే తెలంగాణాలో ప్రమాదంలో పడిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు ఘోరీ కడతారని కేసీఆర్ గుర్తించారని వ్యాఖ్యానించారు. చేయని తప్పున‌కు కోమటిరెడ్డి - సంపత్ లపై కేసీఆర్ అనర్హత వేటు వేయించారని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణాలో తన పత్వా అమలు కావాలని ఆశపడుతున్నారని అయితే అది చెల్లదని స్ప‌ష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఏది జరిగినా చర్యలు గవర్నర్ తీసుకోవాల్సి ఉంటుందని - సభ్యులపై అనర్హత వేటువేసే హక్కు స్పీకర్ లేదని రేవంత్ తెలిపారు. గవర్నర్ ప్రమేయం లేకుండా స్పీకర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం కోర్టుల్లో చెల్లదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై నిలదీస్తామనే కాంగ్రెస్ సభ్యులను అసెంబ్లీ నుండి గెంటేశారని మండిప‌డ్డారు.

నాలుగు ఏళ్ళవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోరని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. `కాంగ్రెస్‌కు ముందు చూపు...టీఆర్ ఎస్ కు ఉన్నది మందు చూపు. అసెంబ్లీ దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయించండి. సీఎంకు - మా సభ్యులకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేస్తే తాగేది ఎవరో తెలుస్తుంది.` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మామను సంతోషపెట్టేందుకు హరిశ్ పాపాలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.`హరీష్ ఎంత చేసినా కేసీఆర్ - కేటీఆర్ లు హరీష్ ను రాజకీయంగా చంపడం ఖాయమ‌ని ఆరోపించారు.