Begin typing your search above and press return to search.

పీవీ గురించి ఎన్ని నిజాలో...

By:  Tupaki Desk   |   30 Aug 2015 9:12 AM GMT
పీవీ గురించి ఎన్ని నిజాలో...
X
పీవీ న‌ర్సింహారావు. త‌న ఆర్థిక ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాల‌తో, భ‌విష్య‌త్‌ పై దూర‌దృష్టితో సంస్క‌ర‌ణ‌లు రూపొందించి దేశాన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నుంచి బ‌య‌ట‌పడేలా చేశారు. తెలుగువాడైన పీవీ ప్రధాని హోదాలో దేశాన్నిఆదుకున్న ధీరుడు. అలాంటి పీవీని...ప్ర‌పంచం స‌హా దేశమంతా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తుంది. అయినా... కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆ ఘనతను ఆయనకు దక్కనీయదు.

అలాంటిది గాంధీల కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న సీనియర్ కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్ పీవీ గొప్పతనాన్ని కీర్తించారు. అదీ ఓ పుస్తకరూపంలో! ఎప్పటికీ నిలిచి ఉండేలా అక్షరబద్దం చేశారు. గాంధీల కుటుంబానికి, సోనియాకు వీరవిధేయుడిగా ఉన్న జైరామ్ చ‌రిత్ర‌లో నిలిచి ఉండేలా.. ద బ్రింక్ అండ్ బ్యాక్ అనే పుస్తకంలో రాశారు. 1991 నాటి ఆర్థిక దేశ స్థితిగతులను మాత్రమే ఫోకస్ చేసిన ఈ పుస్తకంలో పీవీని చైనా సంస్కరణల సారథి డెంగ్ జియావోపింగ్‌ తో పోల్చారు.

ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీతో కలిసి దేశానికి ప్రధానిగా పనిచేసినాళ్లు మొత్తం 14 మంది. వీరందరిలో ఎవరి గొప్ప వారికున్నా.. దేశాన్ని పటిష్టం చేసిన చరిత్ర, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించి గాడిలో పెట్టిన ఘనత మాత్రం.. పీవీ నర్సింహారావుదే. 1991 నుంచి 96వరకూ ఆయన దేశానికి ప్రధానిగా చేశారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత 1989 నుంచి 91వరకూ దేశ రాజకీయ పరిణాలు అనేక రకాలుగా మారాయి. ఆ దెబ్బతో దేశ ఆర్థిక ప్రగతి కూడా పాతాళానికి పడిపోయింది. అలాంటి సమయంలో 1991లో పీవీకి ప్రధాని పట్టం గట్టింది కాంగ్రెస్ పార్టీ.

అయితే, ఆయనేమీ గాంధీల కుటుంబానికి వారసుడు కాదు.. అధిష్టానానికి విధేయుడూ కాదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పీఎం కాకతప్పలేదు.. మొన్నీమధ్య గ్రీస్ ఆర్థిక స్థితి ఎంతలా దిగజారిందో, క‌రెక్టుగా చెప్పాలంటే "దివాళా తీసిందో" 1991లో భారత్‌ది అదే పరిస్థితీ. ఆ విపత్తు దశలో ప్రధానిగా నరసింహారావు ఉండబట్టి.. మళ్లీ నిలదొక్కుకోగలిగాం తప్ప మరో కారణం లేదంటున్నారు జైరామ్ రమేష్.

పీవీ ప్రధాని అయిన వెంటనే మన్మోహన్ సింగ్‌ ను ఆర్థిక మంత్రిగా, చిదంబరాన్ని వాణిజ్యమంత్రిగా, తనను సలహాదారుగా నియమించి అనేక వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. రూపాయి పతనం ఆరంభమైన 1991 జూలై 3న ఉదయం 9గంటల సమయంలో ఏర్పాటు చేసిన భేటీ దగ్గర నుంచి.. ఆర్థిక సంస్కరణలను ఆద్యంతం నడిపించిన అనేక వివరాల వరకూ పుస్తకంలో రాశారు జైరామ్. గాంధీ కుటుంబ అనుచరులు కొన్ని సందర్భాల్లో పీవీని నిలవరించే ప్రయత్నం చేసినా.. దేశమే ముఖ్యమన్నట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలే అసలైన విజయాలని కీర్తించారు జైరాం రమేష్. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రాన్ని అవపోసనపడితే.. పీవీ మాత్రం బహువిధ ప్రజ్ఞాశాలని అని ప్రశంసించారు.

పీవీ పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్‌లోనే. సేవచేసింది ఆ కాంగ్రెస్ పార్టీకే. అలాంటిది కనీసం చివరి క్షణాల్లో అయినా గాంధీలు పీవీని కానీ, ఆయ‌న‌ కుటుంబాన్ని కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖ‌రికి అంద‌రు ప్ర‌ధాన‌మంత్రుల ఢిల్లీలో స‌మాధి కూడా ఏర్పాటుచేయ‌లేదు. ఇప్పటికీ జయంతి వేడుకలో నివాళి కూడా అర్పించరు.

మ‌రోవైపు ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్న వ్య‌క్తిగా, గాంధీ కుటుంబ స‌భ్యుల‌కు విధేయుడిగా ఉన్న జైరాం రమేష్.. కాంగ్రెస్‌లో క్రియాశీలంగా ఉంటూనే పీవీని అక్షరం అక్షరంలో పొగడ‌టం ఆశ్చర్యంగా ఉందన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. తన పుస్తకంలో పీవీని పొగిడిన జైరాం రమేశ్ పై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి చర్య తీసుకుంటుందా? కాలం సమాధానం ఇస్తుంది.