Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ మీ ఆస్తి అనుకున్నారా బాస్?

By:  Tupaki Desk   |   24 July 2017 4:12 AM GMT
ఆ ఇద్దరూ మీ ఆస్తి అనుకున్నారా బాస్?
X
ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక కీలక పార్టీ పేరునే తాము కూడా పెట్టుకున్నందుకు... చాలా విషయాల మీద తమకు పేటెంటు హక్కులు ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదా....? లేదా, స్వాతంత్ర్య పూర్వం నాటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగమూర్తులు, మేధావులు అందరూ ఎప్పటికీ తమ ఆస్తి, మరెవ్వరూ ఆ పేర్లను కూడా వాడుకోవడానికి వీల్లేదు.. అని అహంకారంతో భావిస్తున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అపర చాణక్యుడు, తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో.. అమానవీయమైన కీలక పాత్ర పోషించిన మేధావుల్లో ఒకడు అయిన జైరాం రమేష్ చెబుతున్న మాటలు వింటే.. ఇది నిజమే అనిపిస్తుంది. మహాత్మాగాంధీ - డాక్టర్ అంబేద్కర్ ల సిద్ధాంతాలను తాము తప్ప మరొకరు పాటించడానికి, ఆచరించడానికి వీల్లేదన్నట్లుగా ఆయన వితండ వాదన చేస్తున్నారు.

బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని హైజాక్ చేసినట్లుగానే.. భాజపా - ఆరెస్సెస్ నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కూడా హైజాక్ చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో భాజపా.. గాంధీ - అంబేద్కర్ సిద్ధాంతాలపై ఎన్నడూ లేనంత ఆసక్తిని కనబురస్తున్నదంటూ సెటైర్లు వేశారు. ఒకవేళ జైరాం మాటలు నిజమే అనుకుందాం.. అయితే అందుకు ఆయన మురిసిపోవాలి గానీ.. విలపించడం ఎందుకు అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాకుండా, వారి తలదన్ని పాలనలోకి రాగలిగిన భాజపా కూటమి కూడా గాంధీ - అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా మారడం అనేది ఆశావహ పరిణామమే కదా! అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

జైరాం మాటలు ఎంత వితండంగా ఉన్నాయంటే.. గాంధీ - అంబేద్కర్ మా పార్టీ కి చెందిన వారు గనుక.. వారు చెప్పిన మంచి మాటలను మేం తప్ప దేశంలో ఎవ్వరూ పాటించకూడదు, వారు సూచించిన మంచి పనులను మేం తప్ప ఎవ్వరూ చేయరాదు.. అని అడ్డు పడేలా ఉంది. జాతీయ నాయకులు ఎప్పటికీ జాతి ఆస్తి అవుతారే తప్ప.. కాంగ్రెస్ పార్టీకి ప్రెవేటు ఆస్తి కాబోరని.. ఇలాంటి వ్యాఖ్యలు జైరాం దురహంకారానికి నిదర్శనం అని జనం అంటున్నారు.