Begin typing your search above and press return to search.

జగన్ మాట తప్పట్లేదు..పారదర్శకతకే పెద్ద పీట!

By:  Tupaki Desk   |   13 Oct 2019 2:29 PM GMT
జగన్ మాట తప్పట్లేదు..పారదర్శకతకే పెద్ద పీట!
X
తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక ముందు నుంచే ఏపీలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తానని చెబుతూ వస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాను సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సమయంలోనూ అన్ని విషయాల కంటే పాలనలో పారదర్శకతకే అత్యధిక ప్రాధాన్యమివ్వనున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. సాధారణంగా రాజకీయ నేతలు చేసిన వాగ్దానాలకు - చేతలకు పెద్దగా పొంతన ఉండదు. అయితే జగన్ విషయంలో మాత్రం ఈ మాటకు అసలు తావు లేకుండా పోతోంది. ఏ పని చేపట్టినా.. అందులో ఇసుమంత కూడా రహస్యమన్నదే లేకుండా క్లిస్టర్ క్లియర్ గా అన్ని విషయాలను ముందుగానే చెబుతూ సాగుతున్న జగన్... రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేశారు. ఈ దిశగా జగన్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం... ఆయన పాలన ఎలా సాగనుందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోందన్న వాదన వినిపిస్తోంది.

రిజిస్ట్రేషన్లు - స్టాంప్స్ శాఖలో నిత్యకృత్యంగా మారిన అవినీతి ఆరోపణలు - మధ్యవర్తుల కమిషన్లు - ముడుపుల బాగోతాలకు ఒక్క దెబ్బతో చెక్ పెట్టేలా జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై క్రయ - వియక్రయదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తామే తయారు చేసుకుని - ఆపై ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ రుసుమును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు - విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు. ఆన్‌ లైన్‌ లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంట్లను తయారు చేసుకోవడంతో పాటు - దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్‌లోడ్‌ చేయడం ద్వారా టైం స్లాట్‌ ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు.

రాష్ట్రంలో ఇళ్లు - భవనాలు - వ్యవసాయ భూములు - నివాసస్థలాలకు సంబంధించి సేల్‌ డీడ్‌ - సేల్‌ అగ్రిమెంట్‌ - తాకట్టు రిజిస్ర్టేషన్‌ - బహుమతి రిజిస్ర్టేషన్లు - జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌ సైట్‌ లో పొందుపరిచింది. వివిధ అవసరాలకు తగినట్లు దాదాపు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ డాక్యుమెంట్‌ లలో క్రయ - విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్‌ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అసవరం లేకుండానే క్రయ - విక్రయదారులే నేరుగా ఈ వ్యవహారాలను ముగించుకునే వెసులుబాటు లభించింది. ఇక వివిధ వర్గాలకు చెందిన వారి సౌలభ్యం కోసం ఈ నమూనా డాక్యుమెంట్లను తెలుగు - ఇంగ్లీష్‌ భాషల్లో పొందుపరుస్తున్నారు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

ఈ కొత్త విధానంలో ఎలా సాగాలన్న విషయానికి వస్తే... సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ ను ప్రింట్‌ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ ను స్కాన్ చేసి - అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం - కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి - వాటిని సవరించారు. నవంబర్‌ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు. స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు.

ఈనెల 14వ తేదీన కర్నూలు - విజయనగరం - 15న అనంతపురం - శ్రీకాకుళం - 16న కడప - విశాఖపట్నం - 17న చిత్తూరు - తూర్పు గోదావరి - 18న నెల్లూరు - పశ్చిమ గోదావరి - 19న ప్రకాశం - కృష్ణా - 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యాయవాదులు - వైద్యులు - రియాల్టర్లు - బిల్డర్లు - పురప్రముఖులు - సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి అవసరమైన సలహాలను - సూచనలను స్వీకరిస్తారు. నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చట్టం 73 - 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చ. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందిస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.