Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌ను బెదిరించిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   28 Aug 2015 6:55 AM GMT
ఎమ్మెల్యేల‌ను బెదిరించిన జ‌గ‌న్‌
X
త్వరలో క్లాస్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? వైసీపీలో చక్కర్లు కొడుతున్న ప్రచారం ఇది. ఇంతకీ జగన్‌ ఆగ్రహానికి కారణమేంటీ అంటే పార్టీ శ్రేణులు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాలపై వైసీపీ అధినేత జగన్‌ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని ప్రోగ్రాములు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఓవైపు పార్టీ అధినేత దీక్షలు, ధర్నాలంటూ అలుపెరగకుండా తిరుగుతుంటే... సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్నారన్న గుసగుసలు లోటస్‌ పాండ్‌ లో వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్‌ ఢిల్లీ వేదికగా ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ప‌లువురు ఎమ్మెల్యే లు దూరంగా ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ లాంజ్‌ నుంచి వైఎస్‌ చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో రెండుసార్లు ధర్నా చేశారు. ఆ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలుంటే ఈ ధర్నాలకు పట్టుమని పాతికమంది కూడా హాజరుకాకపోవడంతో అధినేత సీరియస్‌ అయ్యారట. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఎంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు? ఏఏ కారణాలతో రావటంలేదని ఆరా తీస్తున్నారట జగన్‌.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ తో ఈ నెల 29న రాష్ట్ర బంద్‌ కు పిలుపునిచ్చారు జగన్‌. ధర్నాను గ్రాండ్‌ సక్సెస్‌ చేసి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. కేడర్‌ ని సమాయత్తం చేస్తోంది. బంద్‌ ను సక్సెస్‌ చేయాలని ఎమ్మెల్యేలందరికీ జగన్‌ సూచించారు. కానీ గత అనుభవాలు జగన్‌ ను కలవరపెడుతున్నాయట. ఈసారి ఎవరైనా హ్యాండ్‌ ఇస్తే ఉపేక్షించకూడదనే ఆలోచనతో ఉన్న జ‌గ‌న్‌ బంద్‌ కి ఎవరైనా డుమ్మా కొడితే గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఏఏ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు..? ఎలా ప్లాన్‌ చేయబోతున్నారో పర్యవేక్షించే పనిలో పార్టీ వర్గాలు ఉన్నాయని సమాచారం.

మొత్తమ్మీద పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటివరకు చూసీచూడనట్టు ఊరుకున్న జగన్‌... ఇకపై కఠినంగా వ్యవహరించాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మరి జగన్‌ ఆదేశాల్ని ఎమ్మెల్యేలు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో చూడాలన్న చర్చ లోటస్‌ పాండ్‌ లో జరుగుతోంది.